శ్రీనగర్: కశ్మీర్ అంశాన్ని ప్రస్తావిస్తూ భారత ప్రధాని నరేంద్ర మోదీపై అనుచిత వ్యాఖ్యలు చేసిన పాకిస్థాన్ మాజీ క్రికెటర్ షాహిద్ అఫ్రిదిపై దేశవ్యాప్తంగా ఆగ్రహావేశాలు వ్యక్తమవుతున్నాయి. ఇప్పటికే ఈ పాక్ మాజీ క్రికెటర్ విద్వేషపూరిత వ్యాఖ్యలను భారత క్రికెటర్లు గౌతం గంభీర్, హర్భజన్ సింగ్, యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ సురేశ్ రైనా తిప్పికొట్టారు. కశ్మీర్ ఎప్పుడు భారత్లో అంతర్బాగమేనని స్పష్టం చేశారు.
అయితే తాజాగా జమ్మూ కశ్మీర్ బీజేపీ చీఫ్ రవీందర్ రైనా అఫ్రిదిపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. అతని బౌలింగ్ను సచిన్, గంగూలీ, ద్రవిడ్, సెహ్వాగ్ చీల్చిచెండాడటాన్ని మర్చిపోలేక ఇలాంటి పిచ్చి వ్యాఖ్యలు చేస్తున్నాడని మండిపడ్డారు.
'అఫ్రిది వెంటనే భారత్కు వ్యతిరేకంగా వ్యాఖ్యానించడం ఆపాలి. అతను తన తరంలో విఫలమైనా ఆటగాడని, తీవ్ర నిరాశకు గురైనవాడని తెలుసు. అలాగే సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, వీరేంద్ర సెహ్వాగ్, రాహుల్ ద్రవిడ్ అతని బౌలింగ్ను చీల్చి చెండాటం ఇంకా మర్చిపోలేదు. 1965లో జరిగిన యుద్దంలో మనసైన్యం వారిని ఓడించి లాహోర్, కరాచీ, ఇస్లామాబాద్లో భారత త్రివర్ణ పతకాన్ని ఎగరవేసింది. 1971లో మరోసారి ఓడించి వారి నుంచి బంగ్లాదేశ్కు విముక్తి కల్పించింది. ఇక దొంగచాటుగా దేశంలోకి చొరబడితే 1999 కార్గిల్ యుద్దంతో మరోసారి బుద్ది చెప్పింది.'అని రవీందర్ రైనా తెలిపారు.
కరోనా బాధితులకు తన స్వచ్చంద సంస్థ ద్వారా సాయం చేస్తున్న అఫ్రిది ఇటీవల పాక్ ఆక్రమిత కశ్మీర్లో పర్యటించాడు. అక్కడి ప్రజలను ఉద్దేశించి మాట్లాడుతూ.. పాకిస్థాన్ సైన్య బలగం ఎంత ఉందో.. అంతమంది భారత సైనికులను మోదీ కశ్మీర్లో మోహరించారని, అతని మనసులో కరోనాను మించిన వ్యాధి ఉందని విద్వేషపూరితమైన వ్యాఖ్యలు చేశాడు.
అంతేకాకుండా కశ్మీర్ ప్రజలు చూపించిన ప్రేమకు తాను ముగ్దుడైననట్లు తెలిపాడు. వచ్చే సీజన్ పీఎjiస్ఎల్లో కశ్మీర్ టీమ్ కూడా వస్తుందని ఆశిస్తున్నానన్నాడు. ఒకవేళ కశ్మీర్ టీమ్ వస్తే మాత్రం ఆ జట్టుకు తానే కెప్టెన్గా ఉంటానని తెలిపాడు. అయితే అఫ్రిది మాట్లాడిన ఈ వ్యాఖ్యలకు సంబంధించిన వీడియో నెట్టింట హల్చల్ చేస్తోంది.
కశ్మీర్ ఎప్పటికీ మాదే.. అఫ్రిదికి యూవీ, ధావన్ కౌంటర్!