కరాచీ: కరోనా వైరస్ మహమ్మారి నివారణలో భాగంగా చేయూతనివ్వడానికి బంగ్లాదేశ్ సీనియర్ వికెట్ కీపర్ ముష్ఫికర్ రహీమ్ ముందుకొచ్చిన విషయం తెలిసిందే.. శ్రీలంకపై 2013లో డబుల్ సెంచరీ చేసిన బ్యాట్ను రహీమ్ వేలంలో పెట్టాడు. అయితే ఈ చరిత్రాత్మక బ్యాట్ను పాకిస్థాన్ మాజీ కెప్టెన్ షాహిద్ అఫ్రిదీ భారీ ధరకు కొనుగోలు చేశాడు.
స్టీవ్ వా మోస్ట్ సెల్ఫిష్ క్రికెటర్.. షేన్ వార్న్ సంచలన వ్యాఖ్యలు!!
షాహిద్ అఫ్రిది తన ఫౌండేషన్ కోసం రహీమ్ వేలంలో ఉంచిన బ్యాట్ను కొనుగోలు చేశాడు. ఈ బ్యాట్కు 20 వేల డాలర్లు చెల్లించి అఫ్రిది సొంతం చేసుకున్నాడు. ఇది బంగ్లాదేశ్ కరెన్సీలో 16.8 లక్షలు. వేలంపై ముష్ఫికర్ రహీమ్ ఆనందం వ్యక్తం చేశాడు. 'అఫ్రిది తన ఫౌండేషన్లో ఉంచడం కోసం నా బ్యాట్ను తీసుకోవడం గొప్పగా భావిస్తున్నా. మాకు అఫ్రిది మద్దతుగా నిలిచినందుకు ధన్యవాదాలు. గత వారం చాలా మంది వేలంలో పోటీ పడ్డారు. పోటీ కొనసాగుతూనే వచ్చింది. అఫ్రిది బ్యాట్ను కొనుగోలు చేస్తున్నట్లు ప్రకటించడంతో వేలం రద్దయ్యింది' అని రహీమ్ తెలిపాడు.
'వేలంలో బ్యాట్ను ఉంచిన విషయంపై నాకు వ్యక్తిగతంగా అఫ్రిది ఫోన్ చేసి మాట్లాడాడు. మే 13వ తేదీన బ్యాట్ను కొంటున్నట్లు ఒక ఆఫర్ లెటర్ను పంపాడు. 20 వేల యూఎస్ డాలర్లకు బ్యాట్ను కొన్నాడు. ఇది బంగ్లాదేశ్ కరెన్సీలో 16.8 లక్షలు ఉంటుంది' అని రహీమ్ పేర్కొన్నాడు. 'నువ్వు నీ దేశం కోసం చేస్తున్న ఈ పని చాలా అద్భుతమైనది. మనం చాలా కష్టకాలంలో ఉన్నాము. ఈ సమయంలో ఒకరిని ఒకరు సపోర్ట్ చేసుకోవాలి. బంగ్లాదేశ్ నుంచి నాకు లభించిన ప్రేమ ఎప్పటికీ మర్చిపోలేనిది' అంటూ ఓ వీడియోలో అఫ్రిదీ పేర్కొన్నాడు.
కరోనా వైరస్ను అరికట్టేందకు మద్దతుగా విరాళం అందజేసేందుకు తను ఆడిన చివరి మ్యాచ్లో ధరించిన జెర్సీ, ఆడిన బ్యాట్ను వేలంలో పెడుతున్నట్లు ఇంగ్లండ్ సీనియర్ పేస్ బౌలర్ జేమ్స్ ఆండర్సన్ ప్రకటించిన విషయం తెలిసిందే. కేప్టౌన్ వేదికగా ఈ ఏడాది జనవరిలో సౌతాఫ్రికాతో అతను చివరి టెస్ట్ మ్యాచ్ ఆడాడు. ఈ మ్యాచ్లో అతను ఏడు వికెట్లు తీయగా.. ఇంగ్లండ్ 189 పరుగుల తేడాతో విజయం సాధించింది.
పాకిస్థాన్ బ్యాట్స్మన్ అజహర్ అలీ వేలంలో ఉంచిన బ్యాట్ను భారత్లోని ఓ మ్యూజియం ఇటీవలే దక్కించుకుంది. వేలంలో బ్యాట్ను పుణెలోని గ్లోరీ క్రికెట్ మ్యూజియం రూ.10లక్షల (పాకిస్థాన్ మారకపు విలువ)కు దక్కించుకుంది. కాలిఫోర్నియాలో ఉంటున్న కాష్ విలానీ రూ.10.10లక్షలకు చాంపియన్స్ ట్రోఫీ షర్టును వేలంలో సొంతం చేసుకున్నాడు. ఇక ఇంగ్లండ్ స్టార్ బ్యాట్స్మన్ జోస్ బట్లర్ కరోనా బాధితుల సహాయార్థం తనకు ఎంతో ఇష్టమైన ప్రపంచకప్ 2019 జెర్సీని వేలంలో విక్రయించాడు. ఆ జెర్సీకి రూ.60.83 లక్షలు వచ్చాయి.