కాబూల్: అఫ్ఘానిస్థాన్ సీనియర్ వికెట్కీపర్, బ్యాట్స్మన్ షఫీకుల్లా షఫఖ్పై ఆ దేశ క్రికెట్ బోర్డు (ఏసీబీ) ఆరేళ్ల నిషేధం విధించింది. ఆరు సంవత్సరాల పాటు ఎటువంటి క్రికెట్ ఆడకుండా ఏసీబీ ఆదివారం నిషేధం విధించింది. రెండేళ్ల క్రితం అఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్ టీ20తో పాటు గతేడాది బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లలో అవినీతికి పాల్పడ్డట్టు రుజువైందనీ, అందుకే వేటు వేసినట్టు ఏసీబీ పేర్కొంది.
ఐపీఎల్లో ఉండే మజా ఐసీసీ టోర్నమెంట్లలో ఉండదు: కోహ్లీ
2018 అఫ్ఘాన్ ప్రీమియర్ లీగ్ ప్రారంభ ఎడిషన్, 2019 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లలో మ్యాచ్ ఫిక్సింగ్ కోసం బుకీలు షఫీకుల్లా షఫఖ్ను సంప్రదించారు. మ్యాచ్ ఫిక్సింగ్ కోసం పలు ప్రయత్నాలు కూడా చేసాడు. ఈ అభియోగాలతో షఫాక్పై ఏసీబీ చర్యలు తీసుకుంది. అవినీతికి పాల్పడినట్లు ఒప్పుకోవడంతో తాజాగా అతనిపై నిషేధం పడింది. ఆటగాళ్ల ప్రవర్తన నియమావళిలోని నిబంధన 2.1.1ను షఫఖ్ ఉల్లంఘించినట్లు తేల్చిన బోర్డు.. చర్యలు తీసుకుంది. ఫిక్సింగ్కు పాల్పడటం లేదా ఫిక్సింగ్ కార్యకలాపాల్లో పాల్గొనడం తదితర అంశాలపై తనను దోషిగా తేల్చింది.
నిబంధన 2.1.3ని కూడా షఫాక్ అతిక్రమించినట్లు ఏసీబీ ఆదివారం తేల్చింది. ఈ నిబంధన ప్రకారం మ్యాచ్ ఫిక్సింగ్ కోసం వివిధ రకాలుగా ప్రయత్నించడంతో పాటు బుకీలు తనను సంప్రదించిన విషయాన్ని ఉద్దేశ పూర్వకంగా దాచిపెట్టడం వంటి అభియోగాలతో షఫాక్పై ఏసీబీ ఆరేళ్ల నిషేధం విధించింది. 30 ఏళ్ల షషాక్ అఫ్ఘాన్ తరపున 24 వన్డేలు, 46 టీ20లను ఆడాడు. చివరిసారిగా 2019 సెప్టెంబర్లో బంగ్లాదేశ్తో మ్యాచ్ ఆడాడు.
ఓ సీనియర్ క్రికెటర్ ఇలాంటి పనులకు పాల్పడటంపై అఫ్ఘాన్ బోర్డు అసహనం వ్యక్తం చేసింది. ఏసీబీ సీనియర్ అవినీతి నిరోధక నిర్వాహకుడు సయ్యద్ అన్వర్ షా ఖురైషి మాట్లాడుతూ... 'ఇది చాలా తీవ్రమైన నేరం. ఒక సీనియర్ జాతీయ ఆటగాడు అవినీతికి పాల్పడ్డాడు అంటే నమ్మలేకపోతున్నాం. 2019 బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్లో తన సహచరురుడిని కూడా ఈ ఊబిలోకి లాగడానికి చూశాడు. కానీ ఆ ప్రయత్నం విఫలమైంది' అని అన్నారు.