సెయింట్ లూసియా: వెస్టిండీస్ మహిళలతో జరిగిన మూడు వన్డేల సిరీస్ను అద్భుత ఆటతో సొంతం చేసుకున్న భారత మహిళలు.. అదే జోరును టీ20ల్లో కూడా కొనసాగిస్తున్నారు. ఐదు టీ20ల సిరీస్లో భాగంగా విండీస్తో ఆదివారం జరిగిన తొలి టీ20లో భారత్ 84 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుంది. ఓపెనర్లు షెఫాలీవర్మ (73; 49 బంతుల్లో 6 ఫోర్లు, 4 సిక్సర్లు), స్మృతీ మంధాన (67; 46 బంతుల్లో 11 ఫోర్లు) అర్ధ సెంచరీలతో చెలరేగి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించారు.
'బ్యాట్స్మన్ కన్నా చాహల్ తెలివైనవాడు.. మధ్య ఓవర్లలో మరోసారి నిరూపించుకున్నాడు'
షెఫాలీ, మంధానలు ఫోర్లు, సిక్సర్లతో విరుచుకుపడుతూ తొలి వికెట్కు 143 పరుగులు సాధించారు. ఈ రికార్డు భాగస్వామ్యం చరిత్ర పుస్తకాల్లో లిఖించబడింది. మహిళల టీ20ల్లో భారత్ తరఫున ఏ వికెట్కైనా ఇదే అత్యధిక పరుగుల భాగస్వామ్యం. ఈ క్రమంలోనే 2013లో బంగ్లాదేశ్ జరిగిన మ్యాచ్లో నమోదైన 130 పరుగుల భాగస్వామ్యం రికార్డును మంధాన-షెఫాల్లీలు బ్రేక్ చేశారు. పూనమ్ రౌత్-తిరుష్ కామిని 130 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు.
షెఫాలీవర్మ టీ20లో తొలి అర్ధ శతకం చేసి భారత్ తరఫున అంతర్జాతీయ టీ20లలో అర్ధ శతకం చేసిన అతిపిన్న వయస్కురాలిగా రికార్డుల్లో ఎక్కింది. ఇక ప్రపంచ క్రికెట్లో ఈ రికార్డు సాధించిన రెండో బ్యాట్స్వుమన్గా నిలిచింది. షెఫాలీ కన్నా ముందు యూఏఈకి చెందిన ఎగొడాగ్ 15 ఏళ్ల 267 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం బాదింది. షెఫాలి 15 ఏళ్ల 285 రోజుల్లో తొలి టీ20 అర్ధ శతకం చేసింది. టీమిండియా బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ తన తొలి టెస్ట్ అర్ధ శతకంను 16 సంవత్సరాల 214 రోజులలో సాధించాడు.
ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో నాలుగు వికెట్ల నష్టానికి 185 పరుగుల భారీ స్కోర్ చేసింది. ఓపెనర్లు స్మృతీ మంధాన, షెఫాలీ వర్మలు తొలి వికెట్కు 143 పరుగులు సాధించారు. ఇన్నింగ్స్ చివర్లో హర్మన్ప్రీత్ (21 నాటౌట్; 13 బంతుల్లో 3 ఫోర్లు), వేదా కృష్ణమూర్తి (15 నాటౌట్; 7 బంతుల్లో 2 ఫోర్లు) బ్యాట్ జులిపించడంతో భారత్ భారీ స్కోర్ చేసింది.
186 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన వెస్టిండీస్ మహిళలు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 101 పరుగులే చేశారు. వికెట్ కీపర్ షీమైన్ క్యాంపబెల్ (33) మినహా ఎవరూ పరుగులు చేయలేదు. భారత బౌలర్లలో శిఖా పాండే, రాధా యాదవ్, పూనమ్ యాదవ్లు తలో రెండు వికెట్లు సాధించగా.. దీప్తి శర్మ, పూజా వస్త్రాకర్లకు చెరో వికెట్ లభించింది. ఐదు టీ20ల సిరీస్ను భారత్ 1-0తో శుభారంభం చేసింది.