నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది:
గత ఏడాది ఐపీఎల్ సమయంలో జరిగిన ఉమెన్ చాంపియన్స్ టీ20 టోర్నీతో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న షెఫాలీ వర్మ ఏడాది తిరిగేలోగా భారత జట్టులో కీలక సభ్యురాలిగా ఎదిగింది. రాబోయే రోజుల్లోనూ తన సత్తా చాటాలని ఉత్సాహంగా ఉన్న షెఫాలీ.. తన కెరీర్కు సంబంధించి వివిధ అంశాలపై సోమవారం మీడియాతో మాట్లాడింది. 'నా ప్రయాణం ఇప్పుడే మొదలైంది. ఐసీసీ ర్యాంకింగ్స్లో టాప్ ర్యాంక్ దాకా చేరడం సంతోషకరమే. మున్ముందు కఠిన పరీక్షా సమయం ఉంది. నాకు ఎదురయ్యే ఎలాంటి సవాల్కైనా సిద్ధంగా ఉన్నా. రాబోయే రోజుల్లో భారత జట్టు ఎక్కువ మ్యాచ్లు గెలిచేలా ప్రయత్నించడం, వాటిలో నేనూ కీలక పాత్ర పోషించడమే ప్రస్తుతానికి నా లక్ష్యాలు' అని షెఫాలీ తెలిపింది.
చెత్త బంతి పడితే బౌండరీ బాదేస్తా:
'బ్యాటింగ్ చేసే సమయంలో నేను ఒకటే ఫార్మాలాను ఫాలో అవుతాను. ఒకవేళ చెత్త బంతి పడితే.. మరో ఆలోచన లేకుండా బౌండరీ బాదుతా. అలాకాకుండా.. మంచి బంతి పడితే మాత్రం ఎక్కువగా సింగిల్స్ తీయడానికి ట్రై చేస్తాను. అది నా సహజసిద్ధమైన ఆట. దాన్ని అస్సలు మార్చుకోను. అరంగేట్రం చేసిన కొద్ది రోజుల్లోనే మంచి పేరు సంపాదించుకున్నా. దాన్ని అలానే కాపాడుకోవాలి' అని షెఫాలీ పేర్కొంది. మొత్తానికి నా లక్ష్యం ఒకటే, బౌలర్లను బాదటం అని అంది.
జట్టులో వాతావరణం చాలా బాగుంటుంది:
'ప్రపంచకప్ ఫైనల్ రోజు మాకు కలిసి రాలేదు. క్రీడల్లో గెలుపోటములు సహజమే. మేం ఒడిసిపట్టుకొని విజయాన్ని అందుకొనే మరిన్ని అవకాశాలు మున్ముందు వస్తాయి. ఫలితం వచ్చేశాక దానిని మనం మార్చలేం. కానీ భవిష్యత్లో ఏం చేయాలో మా చేతుల్లోనే ఉంది. జట్టులో వాతావరణం చాలా బాగుంటుంది. సీనియర్లే మాట్లాడాలని, జూనియర్లు వారు చెప్పింది వినాలని అస్సలు ఉండదు. కెప్టెన్ హర్మన్ప్రీత్, స్మృతిలాంటి సీనియర్లయితే నన్ను మరింతగా ప్రోత్సహిస్తూ వచ్చారు. క్రికెటర్గా నా ఎదుగుదలకు హర్యానా క్రికెట్ అసోసియేషన్కు చెందిన అశ్వని సార్, బాసెలిన్ మద్దతుగా నిలిచారు. నాకు ఏ సమస్య ఉన్నా.. భారత చీఫ్ కోచ్ రామన్ సార్ను ఆశ్రయిస్తాను. సమస్య ఏదైనా పరిష్కారం చూపిస్తారు' అని యువ ఓపెనర్ చెప్పింది.
నాన్నపై ఆర్ధిక భారం తగ్గింది:
'స్మృతితో ఓపెనింగ్ చేయడం ఆనందంగా ఉంది. మేం అతిగా ఆలోచించం. ఇద్దరం సహజసిద్ధమైన ఆటనే ఆడేందుకు ప్రయత్నిస్తాం. తేలికైన బంతి పడిందంటే చాలు చితక్కొట్టడమే. ఈ విషయంలో ఇద్దరం ఒకే తరహాలో ఆలోచిస్తాం. కరోనాతో వచ్చిన విరామంలో నా ఫిట్నెస్ను మెరుగుపర్చుకోవడంపై దృష్టి పెట్టాను. ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో ప్రతికూల ఆలోచనలు రాకుండా ఉండటం కూడా ఎంతో కీలకం. దీనికి సంబంధించి స్పోర్ట్స్ సైకాలజిస్ట్ నాకు ఎంతో సహకరిస్తున్నారు. నేను ఈ స్థాయికి చేరడానికి కారణమైన మా నాన్నపై కూడా ఇప్పుడు ఆర్ధిక భారం తగ్గింది' అని యువ సంచలనం చెప్పుకొచ్చింది.
ఫైనల్ మ్యాచ్లో విఫలం:
ఆస్ట్రేలియా గడ్డపై ఇటీవల ముగిసిన మహిళా టీ20 ప్రపంచకప్లో షెఫాలీ సంచలన ఇన్నింగ్స్లతో ఆకట్టుకుంది. టోర్నీలో ఐదు మ్యాచ్లు ఆడిన ఓపెనర్.. 158.25 స్ట్రైక్రేట్తో 163 పరుగులు చేసింది. కానీ.. ఆస్ట్రేలియాతో జరిగిన ఫైనల్ మ్యాచ్లో మాత్రం ఆదిలోనే తడబడి పెవిలియన్ చేరింది. ఫలితంగా 85 పరుగుల తేడాతో భారత్ ఓడి తొలిసారి విశ్వవిజేతగా నిలిచే అవకాశాన్ని చేజార్చుకుంది.