టీ20ల్లో షెఫాలీ అరుదైన రికార్డు.. డ్యాషింగ్ ఓపెనర్ తర్వాతే అలిసా హేలీ!!

మెల్బోర్న్: హర్యానా సంచలనం షెఫాలీ వర్మ ఐసీసీ మహిళల టీ20 ప్రపంచకప్లో అదరగొడుతోంది. టీమిండియా డాషింగ్ ఓపెనర్ వీరేందర్ సెహ్వాగ్ తరహాలోనే ఆదినుంచే ప్రత్యర్థి బౌలర్లపై విరుచుకుపడుతూ.. పరుగుల సునామీ సృష్టిస్తోంది. భారత మహిళలు ఆడిన మూడు మ్యాచ్లలోనూ షెఫాలీ మెరుపు ఇన్నింగ్స్లతో జట్టుకు అద్భుత విజయాలను అందించింది. ఈ రోజు న్యూజిలాండ్తో జరిగిన మ్యాచ్లో కూడా అదరగొట్టింది. 34 బంతుల్లో నాలుగు ఫోర్లు, మూడు సిక్సర్లతో 46 పరుగులు చేసి 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' రెండోసారి నిలిచింది.
టీ20ల్లో అత్యధిక స్ట్రైక్రేట్:
కళ్లు చెదిరే సిక్సర్లు, భారీ బౌండరీలు బాదుతున్న షెఫాలీ వర్మ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది. మహిళల టీ20ల్లో అత్యధిక స్ట్రైక్రేట్ ఉన్న బ్యాటర్గా నిలిచింది. ఇప్పటి వరకు షెఫాలీ 147.97 స్ట్రైక్రేట్తో 438 పరుగులు చేసింది. క్లోయి ట్రయాన్ 138.31 (722 పరుగులు), అలిసా హేలీ 129.66 (1,875) స్ట్రైక్రేట్తో కూడా షెఫాలీ తర్వాతి స్థానాల్లో ఉండడం గమనార్హం. కనీసం 200 పరుగులను ఈ గణాంకాలకు ఆధారంగా చేసుకున్నారు.
టీ20 ప్రపంచకప్లో అధిక స్ట్రైక్రేట్:
ఒకే టీ20 ప్రపంచకప్లో షెఫాలీ వర్మ కన్నా ఎక్కువ స్ట్రైక్రేట్తో మరెవ్వరూ పరుగులు చేయకపోవడం మరో విశేషం. ఈ మెగా టోర్నీలో ఆమె 172.72 స్ట్రైక్రేట్తో 114 పరుగులు చేసింది. గతేడాది సెప్టెంబర్ 25న సూరత్లోని లాలాభాయ్ కాంట్రాక్టర్ స్టేడియంలో దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టీ20తో షెఫాలీ ఆరంగేట్రం చేసింది. దీంతో భారత్ తరఫున అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్ ఆడిన రెండో పిన్న వయస్కురాలిగా షఫాలీ వర్మ (15 ఏళ్ల 239 రోజులు) గుర్తింపు పొందింది. గతంలో గార్గి బెనర్జీ 14 ఏళ్ల 162 రోజుల వయసులో (1978లో) భారత్కు వన్డేలో ప్రాతినిధ్యం వహించింది.

పిన్న వయసులో హాఫ్ సెంచరీ:
అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన భారత క్రికెటర్గా కూడా షెఫాలీ ఇప్పటికే రికార్డుల్లోకి ఎక్కిన విషయం తెలిసిందే. హిట్మ్యాన్' రోహిత్ శర్మ రికార్డును ఆమె బద్దలైంది. రోహిత్ 20 సంవత్సరాల 143 రోజుల వయసులో హాఫ్ సెంచరీ సాధించగా.. షెఫాలీ 15 సంవత్సరాల 285 రోజుల్లోనే ఆ ఘనతను అందుకుంది. ఓవరాల్గా మహిళల అంతర్జాతీయ టీ20ల్లో పిన్న వయసులో హాఫ్ సెంచరీ సాధించిన ఘనత యూఏఈకి చెందిన ఎగోడాజ్ పేరిట ఉంది. ఎగోడాజ్ 15 ఏళ్ల 267 రోజుల వయసులో అర్థ శతకం సాధించింది.

టీమిండియా జైత్రయాత్ర:
టీ20 ప్రపంచకప్లో టీమిండియా జైత్రయాత్ర కొనసాగిస్తోంది. పటిష్ట న్యూజిలాండ్ను ఓడించి గురువారం హ్యాట్రిక్ విజయం అందుకుంది. ఈ మ్యాచ్లో టీమిండియా 4 పరుగుల తేడాతో విజయాన్ని అందుకుని.. మెగా టోర్నీ నాకౌట్ బెర్త్ను ఖరారు చేసుకుంది. 134 పరుగుల స్వల్ప లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో కివీస్ 6 వికెట్లు కోల్పోయి 129 పరుగులకే పరిమితమైంది. అంతకుముందు టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన భారత్ 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 133 పరుగులు చేసింది.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications