వరల్డ్కప్కు ఎంపిక చేసే ఆటగాళ్లను ఐపీఎల్లోని ప్రదర్శన ఆధారంగా కాకుండా.. 4 సంవత్సరాల ప్రదర్శన, వారి ఫామ్ ఆధారంగా ఎంపిక చేయాలని టీమిండియా వైస్కెప్టెన్ రోహిత్ శర్మ పేర్కొన్నారు. ఐపీఎల్ ముగిసిన రెండు వారాల అనంతరం వరల్డ్కప్ సమరం మొదలు కానుంది. దీంతో ఇప్పటికే అన్ని జట్లు.. జట్టు ఎంపికపై తీవ్ర కసరత్తులు చేస్తున్నాయి. ముందుగా కివీస్ జట్టు 15 మంది సభ్యులతో కూడిన జట్టును ప్రకటించింది. మరోవైపు టీమిండియా మాత్రం పూర్తిస్థాయి జట్టు ఎంపికపై ఓ అంచనాకు రాలేదు. ఇందుకోసం సెలక్టర్లు కసరత్తులు చేస్తున్నారు.
ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా టీమిండియా వరల్డ్కప్ జట్టు ఎంపిక ఉండదని ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లీ స్పష్టం చేసారు. అయితే ఐపీఎల్ ప్రదర్శన ఆధారంగా జట్టు ఎంపిక ఉంటుందని వార్తలు వస్తున్నాయి. ఈ నేపథ్యంలో రోహిత్ స్పందించారు.
ఐపీఎల్ ప్రదర్శనతో ఎంపిక చేయొద్దు:
'వరల్డ్కప్ జట్టు ఎంపికకు ఐపీఎల్ ప్రదర్శన ఆధారం కావొద్దని నా అభిప్రాయం. గత నాలుగేళ్లలో ఆటగాళ్లు చాలా అంతర్జాతీయ మ్యాచులు (వన్డేలు, టీ20లు) ఆడారు. ఆ ప్రదర్శన సరిపోతుంది. టీ20 ఫార్మాట్ ఆధారంగా వన్డే వరల్డ్కప్కు ఎంపిక చేయొద్దు. ఐపీఎల్ భిన్నమైన ఆట. ఫ్రాంచైజీ ఆధారంగా ఆటగాళ్లు ఆడతారు. అయితే ఫామ్ కొనసాగించడం చాలా కీలకం. ఇందులో భాగంగానే వరల్డ్కప్కు సన్నద్ధమయ్యేందుకు ఐపీఎల్ ఉపయోగపడుతుంది' అని రోహిత్ అభిప్రాయపడ్డారు.
అత్యుత్తమ జట్టునే ఎంపిక చేస్తారు:
ఇప్పటికే కోచ్, కెప్టెన్, సెలక్టర్లు జట్టు ఎంపికపై ఓ అవగాహనకు వచ్చారు. అత్యుత్తమ జట్టునే వారు ఎంపిక చేస్తారు. అయితే అదనపు ఓపెనర్, మిడిలార్డర్, బౌలర్ అవసరమా అనే అంశను కూడా పరిశీలిస్తారు. గతంలో ఇంగ్లాండ్ వాతావరణం వేడిగా ఉంది. ప్రస్తుతం కూడా అలాగే ఉంటే అదనపు స్పిన్నర్ అవసరం' అని రోహిత్ చెప్పుకొచ్చారు.