
ముంబై: మహిళల టీ20 ప్రపంచకప్లో భాగంగా శుక్రవారం డిపెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత్ 17 పరుగుల తేడాతో ఘన విజయం సాధించింది. టీమిండియా స్టార్ స్పిన్నర్ పూనమ్ యాదవ్ 4 వికెట్లతో చెలరేగడంతో.. లక్ష్య ఛేదనలో ఆసీస్ 19.5 ఓవర్లలో 115 పరుగులకు ఆలౌట్ అయింది. ఈ విజయంతో టీ20 ప్రపంచకప్లో భారత మహిళలు ఘనమైన బోణీ కొట్టారు.
భారీ స్కోరు సాధించలేకపోయినా భారత బౌలర్లు గొప్పగా పోరాడి ఆతిథ్య జట్టు ఆసీస్ను మట్టికరిపించారు. స్పిన్నర్ పూనమ్ యాదవ్ తిప్పేయగా.. దీప్తి శర్మ (49; 46 బంతుల్లో 3 ఫోర్లు), షెఫాలీ వర్మ (29; 15 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్సర్) లు అద్భుతంగా ఆది భారత్ పోరాడే స్కోర్ అందించారు. ఈ సందర్భంగా హర్మన్సేనపై భారత క్రికెటర్లు, మాజీలు ప్రశంసల జల్లు కురిపించారు.
'ప్రపంచకప్లో సూపర్ శుభారంభం. దీప్తి శర్మ బ్యాటుతో.. పూనమ్ యాదవ్, శిఖ పాండే బంతితో అదరగొట్టారు' అని జులన్ గోస్వామి ట్వీట్ చేసారు.
'అద్భుత విజయం సాధించిన మహిళా జట్టుకి అభినందనలు' అని వన్డే, టెస్ట్ కెప్టెన్ మిథాలీ రాజ్ ట్వీటారు.
'ఇది అద్భుత విజయం. భారత మహిళా జట్టు గొప్పగా ఆడింది. ఆస్ట్రేలియాపై 132 పరుగులను అద్భుతంగా పోరాడి కాపాడుకున్నారు. హర్మన్సేనకు శుభాకాంక్షలు' అని మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ ట్వీట్ చేసారు.
'మెగాటోర్నీలో అదిరే ఆరంభం ఇది. తొలి మ్యాచ్లోనే డిఫెండింగ్ ఛాంపియన్ ఆస్ట్రేలియాను ఓడించారు. మొదటగా దీప్తి శర్మ స్కోరు బోర్డును ముందుకు నడిపించగా.. అనంతరం పూనమ్ యాదవ్ మ్యాచ్ను మలుపుతిప్పింది. మొత్తంగా భారత మహిళా జట్టు గొప్పగా ఆడింది' అని మాజీ క్రికెటర్ మహ్మద్ కైఫ్ పేర్కొన్నారు.
'భారత మహిళా జట్టుకు శుభాకాంక్షలు. టీ20 ప్రపంచకప్లో ఘనమైన బోణీ. ఆసీస్పై 132 పరుగులను కాపాడుకోవడానికి పూనమ్ సహా అందరూ అద్భుతంగా పోరాడారు. తర్వాత మ్యాచ్ల్లో కూడా బాగా ఆడాలని కోరుకుంటున్నా' అని హైదరాబాద్ సొగసరి వీవీఎస్ లక్ష్మణ్ ట్వీట్ చేసారు.
'ప్రపంచకప్లో ఆస్ట్రేలియా ఫేవరేట్. కానీ.. ఇది గొప్ప విజయం. భారత బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ చేశారు. దీప్తి గొప్పగా బ్యాటింగ్ చేసింది. లెగ్ స్పిన్నర్ పూనమ్ మ్యాచ్ను మలుపు తిప్పింది' అని వ్యాఖ్యాత హర్షా బోగ్లే అన్నారు.
'స్పిన్తో విజయం.. అది కూడా ఆస్ట్రేలియాలో. డిఫెండింగ్ ఛాంపియన్పై తక్కువ స్కోరుని కూడా కాపాడుకొని 17 పరుగుల తేడాతో విజయం సాధించారు. భారత మహిళా జట్టుకు హ్యాట్సాఫ్' అని స్టార్ కామెంటేటర్ ఆకాశ్ చోప్రా పేర్కొన్నారు.