
హైదరాబాద్: ఐపీఎల్ టోర్నీలో భాగంగా ఆదివారం ఉప్పల్ స్టేడియంలో చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ చివరివరకు పోరాడి నాలుగు పరుగుల తేడాతో ఓటమిపాలైన సంగతి తెలిసిందే. అయితే, ఈ ఓటమిపై సన్రైజర్స్ హైదరాబాద్ అభిమానులు జీర్ణించుకోలేకపోతున్నారు.
ఐపీఎల్ 2018 స్పెషల్ వెబ్ సైట్ | ఐపీఎల్ 2018 పూర్తి షెడ్యూల్ | సన్రైజర్స్ హైదరాబాద్ పూర్తి షెడ్యూల్
అంతేకాదు సన్రైజర్స్ ఓటమికి ఫీల్డ్ అంపైర్ వినీత్ కులకర్ణినినే కారణమని అభిమానులు సోషల్ మీడియా వేదికగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సన్రైజర్స్ ఇన్నింగ్స్లో 17వ ఓవర్ని చెన్నై బౌలర్ శార్దుల్ ఠాకూర్ వేశాడు. ఈ ఓవర్ రెండో బంతిని శార్దుల్ ఠాకుర్ విలియమ్సన్ చాతిపైకి ఫుల్ టాస్గా వేసాడు.
అయితే అంపైర్ నోబాల్ ఇవ్వలేదు. దీనికి వెంటనే విలియమ్సన్ అంపైర్ను ప్రశ్నిస్తూ.. మైదానంలో అసహనం వ్యక్తం చేశాడు. అది నోబాల్ అని టీవీ రిప్లేలో సైతం స్పష్టం అయింది. అంఫైర్ గనుక ఈ బంతిని నో బాల్గా ఇచ్చి ఉంటే, ఒక పరుగు అదనంగా రావడమే కాకుండా మరో బంతితో ఫ్రీహిట్ వచ్చేది.
ఇదే జరిగితే మ్యాచ్ ఫలితంలో తేడా ఉండేది. దీంతో అంపైర్ వినీత్ కులకర్ణిపై సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. ఈ మ్యాచ్లో 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అంపైర్కే ఇవ్వాలి' అని కొందరు నెటిజన్లు అనగా, 'ఫీల్డ్ అంపైర్లు ఎందుకు టీవీ అంపైర్ సమీక్షను కోరలేదు.. చిన్న విషయాలే.. మ్యాచ్ ఫలితంపై ప్రభావం చూపుతాయని తెలియదా' అని ఇంకొందరు అన్నారు.
ఇక ఈ మ్యాచ్లో విలియమ్సన్ (84), యూసఫ్ పఠాన్(45) చివరి వరకు పోరాడినప్పటికీ సన్రైజర్స్ ఓటమిపాలైంది. సన్రైజర్స్ విజయానికి ఆఖరి బంతికి ఆరు పరుగులు అవసరం కాగా, క్రీజులో ఉన్న రషీద్ఖాన్ సింగిల్ తీయడంతో నాలుగు పరుగుల తేడాతో ఓటమి పాలైంది.