న్యూఢిల్లీ: కరోనా కారణంగా అర్దాంతరంగా నిలిచిపోయిన ఐపీఎల్ 2021 సెకండాఫ్ యూఏఈ వేదికగా నిర్వహించేందుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి(బీసీసీఐ) సమాయత్తం అవుతోంది. ఇప్పటికే ఈ విషయాన్ని అధికారికంగా ప్రకటించిన బోర్డు.. షెడ్యూల్ మాత్రం ఇంకా ప్రకటించలేదు. అయితే సెప్టెంబర్ 19 నుంచి అక్టోబర్ 15 మధ్య లీగ్ జరగనుందని బీసీసీఐకి చెంది ఓ అధికారి తెలిపారు. ఈ క్యాష్ రిచ్ లీగ్ రెండో దశకు సంబంధించిన పూర్తి షెడ్యూల్ త్వరలోనే విడుదలవుతుందన్నారు. ముంబై ఇండియాన్స్- చెన్నై సూపర్ కింగ్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుందని, అక్టోబర్ 15న ఫైనల్ జరుగుతుందన్నారు.
క్వాలిఫైయర్ 1, క్వాలిఫైయర్ 2.. అక్టోబర్ 10, 13 తేదీల్లో జరగనుండగా.. ఎలిమినేటర్ అక్టోబర్ 11న నిర్వహించనున్నారు. 'సెప్టెంబర్ 19 నుంచి జరగనున్న ఐపీఎల్ రెండో దశను ముంబై-చెన్నై మ్యాచ్తో ప్రారంభించాలని మేము నిర్ణయించాం. లీగ్కు సంబంధించి పూర్తి ప్రణాళిక త్వరలోనే ఆయా ఫ్రాంఛైజీలకు ఇవ్వనున్నాం" అని సదరు అధికారి పేర్కొన్నారు.
గతవారమే ఐపీఎల్కు సంబంధించిన అప్డేట్ను బీసీసీఐ కార్యదర్శి జై షా ట్విటర్ వేదికగా పంచుకున్నారు. "మరోసారి యూఏఈ వేదికగా లీగ్ను నిర్వహించనున్నాం. టోర్నీ సజావుగా సాగడానికి అక్కడి ప్రభుత్వంతో కలిసి పనిచేయనున్నాం" అని షా పేర్కొన్నాడు. యూఏఈ వేదికగా జరిగే ఐపీఎల్కు విదేశీ క్రికెటర్లు అందరూ అందుబాటులో ఉండేలా బీసీసీఐ ప్రణాళికలు రూపొందిస్తోంది. ఐపీఎల్కు ముందే కరిబీయన్ ప్రీమియర్ లీగ్ ముగించేలా వెస్టిండీస్ క్రికెట్తో చర్చలు జరిపింది. ఆగస్టు 26 నుంచి సెప్టెంబర్ 15 వరకు కరిబీయన్ ప్రీమియర్ లీగ్ జరిగేలా అక్కడి నిర్వాహకులను ఒప్పించింది. దాంతో ఆటగాళ్లు బయో బబుల్ టు బబుల్కు నేరుగా ఐపీఎల్ టీమ్స్తో కలవనున్నారు.