
హైదరాబాద్: ముక్కోణపు టీ20 సిరీస్లో భాగంగా సోమవారం ఆస్ట్రేలియాతో జరిగిన మ్యాచ్లో భారత మహిళల జట్టు 36 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. హ్యాట్రిక్ ఓటములతో భారత మహిళల జట్టు ముక్కోణపు టీ20 సిరీస్ నుంచి నిష్క్రమించింది.
పేటీఎం కప్లో భాగంగా సోమవారం ముంబైలోని బ్రాబౌర్నే స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్లో భారత ఓపెనర్లు రోడ్రిక్స్, అనూజ పాటిల్, హర్మన్ప్రీత్ కౌర్ మినహా మిగతా వారంతా పూర్తిగా విఫలమయ్యారు. ఈ ఓటమితో ముక్కోణపు సిరీస్ ఫైనల్కు దూరమైంది.
మరోవైపు తాజా ఆస్ట్రేలియా జట్టు ముక్కోణపు టీ20 సిరిస్ ఫైనల్లోకి ప్రవేశించింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన భారత మహిళల జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ఆసీస్ ఓపెనర్లు మూని(71), విల్లాని(61) దూకుడుగా ఆడటంతో నిర్ణీత 20 ఓవర్లలో ఐదు వికెట్లు కోల్పోయి ఆస్ట్రేలియా 186 పరుగులు చేసింది.
అనంతరం 187 పరుగుల విజయ లక్ష్యంతో బరిలోకి దిగిన భారత మహిళల జట్టు ఆరంభం నుంచే తడబాడుకు గురైంది. ఆసీస్ బౌలర్ మేగన్ వేసిన రెండో ఓవర్లో ఓపెనర్ స్మృతి మంధాన(3), మిథాలీ రాజ్లను డకౌట్గా పెవిలియన్కు చేర్చింది. దీంతో ఆరంభంలోనే భారత్ కష్టాల్లో పడింది.
ఆ తర్వాత 4.1వ ఓవర్లో దీప్తి శర్మను ఔట్ చేసిన మేగన్ టీ20ల్లో హ్యాట్రిక్ సాధించిన తొలి ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్గా చరిత్ర సృష్టించింది. ఓపెనర్గా బరిలోకి దిగి దూకుడుగా ఆడుతున్న రోడ్రిక్స్(50)ను కిమ్మిన్స్ పెవిలియన్కు చేర్చడంతో భారత్ ఇన్నింగ్స్ నెమ్మదించింది.
చివర్లో కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్ (33), అనూజ పాటిల్ (38) దూకుడుగా ఆడినప్పటికీ భారత్కు విజయాన్ని అందించలేకపోయారు. నిర్ణీత 20 ఓవర్లలో భారత్ 5 వికెట్ల నష్టానికి 150 పరుగులు మాత్రమే చేయగలిగింది. ఈ మ్యాచ్లో హ్యాట్రిక్ సాధించిన మేగన్కు ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది.
ఈ ముక్కోణపు సిరిస్లో భారత్కు ఇది వరుసగా మూడో ఓటమి. ఇప్పటికే ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్లతో జరిగిన మ్యాచ్ల్లో ఓటమి పాలైంది. టోర్నీలో భాగంగా భారత్ మహిళల జట్టు తన తదుపరి మ్యాచ్ను మార్చి 29న ఇంగ్లాండ్తో ఆడనుంది. ఈ మ్యాచ్ భారత్కు నామ మాత్రపు మ్యాచ్. ఫైనల్లో ఇంగ్లాండ్-ఆసీస్లు తలపడనున్నాయి.