సౌరాష్ట్ర: భారత క్రికెట్ ప్రపంచంలో పెను విషాదం చోటుచేసుకుంది. సౌరాష్ట్ర యువ క్రికెటర్ అవి బరోట్ శుక్రవారం (అక్టోబర్ 16) గుండె పోటుతో మరణించాడు. శుక్రవారం సాయంత్రం తన ఇంట్లో అస్వస్థతకు గురైన బరోట్ను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్తుండగా కన్నుమూశాడు. అతడికి తల్లి, భార్య ఉన్నారు. ప్రస్తుతం అవి బరోట్ సతీమణి గర్భవతి. సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) అవి బరోట్ మరణాన్ని ధ్రువీకరించింది. 29 ఏళ్ల అవి బరోట్ అకాల మరణం చెందడంతో భారత క్రీడా ప్రపంచం ఒక్కసారిగా షాక్కి గురైంది. బరోట్ మరణంపై పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.
అవి బరోట్ మరణ వార్తను సౌరాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ (ఎస్సీఏ) ఈరోజు అధికారికంగా ప్రకటించింది. 'ఈ వార్త విని ప్రతి ఒక్కరం దిగ్భ్రాంతికి గురయ్యాం. అవి బరోట్ అక్టోబరు 15 సాయంత్రం గుండెపోటుతో మరణించాడు. సౌరాష్ట్ర క్రికెట్లో తనకంటూ ప్రత్యేక స్థానం ఉంది' అని మీడియాకు ప్రకటన విడుదల చేశారు. ఎస్సీఏ అధ్యక్షుడు జయదేవ్ షా మాట్లాడుతూ... 'అవి బరోట్ ఇంట్లో అస్వస్థతకు గురికాగా.. ఆసుపత్రికి తీసుకెళ్తుండగా అంబులెన్స్ లోపలే తుది శ్వాస విడిచాడు. అతను చాలా చురుకైన క్రికెటర్. ఎంతో ప్రతిభఉంది. అతని ప్రతిభ చూసే కెరీర్ ప్రారంభించిన హర్యానా నుంచి సౌరాష్ట్రకు తీసుకువచ్చాను. అతడు లేడన్న వార్త జీర్ణించుకోలేకపోతున్నా' అని అన్నారు.
'అవి బరోట్ మరణ వార్త విని షాక్ అయ్యాను. ఇది చాలా బాధాకరమైనది. అతను గొప్ప సహచరుడు మరియు గొప్ప క్రికెట్ నైపుణ్యాలు కలిగి ఉన్నాడు. ఇటీవల జరిగిన అన్ని దేశీయ మ్యాచ్లలో అద్భుతంగా రాణించాడు. అలాంటి ఆటగాడిని కోల్పోవడం నిజంగా దురదృష్టకరం. అవి బరోట్ కుటుంబానికి ఆ దేవుడు మనోదైర్యాలు ఇవ్వాలని కోరుకుంటున్నా. బరోట్ ఆత్మకు శాంతిచేకూరాలి ప్రార్థిస్తున్నా' అని సౌరాష్ట్ర క్రికెట్ టీమ్ కెప్టెన్ షా పేర్కొన్నాడు.
29 ఏళ్ల అవి బరోట్ రైట్ హ్యాండ్ బ్యాటర్. 2011లో అండర్-19 క్రికెట్ జట్టుకు కెప్టెన్గా కూడా వ్యవహరించాడు. 2019-20 సీజన్కు గానూ రంజీ ట్రోఫీ గెలిచిన జట్టులో అవి బరోట్ సభ్యుడు. బరోట్ కెరీర్ విషయానికొస్తే.. 38 ఫస్ట్క్లాస్ మ్యాచ్లు ఆడాడు. 38 లిస్ట్-ఏ, 20 దేశవాళీ టీ20 మ్యాచులు ఆడాడు. వికెట్ కీపర్ బ్యాటర్ అయిన బరోట్.. ఫస్ట్క్లాస్ మ్యాచ్లలో 1547 పరుగులు, లిస్ట్-ఏ మ్యాచ్లలో 1030 రన్స్ , టీ20లలో 717 పరుగులు చేశాడు. సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో భాగంగా గోవాతో జరిగిన మ్యాచ్లో 53 బంతుల్లోనే 122 పరుగులు చేసి ఔరా అనిపించాడు.