
బెంగళూరు: బెంగళూరులోని ఎం చిన్నస్వామి స్టేడియం వేదికగా ముంబై-మధ్య ప్రదేశ్ మధ్య రంజీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. తొలుత బ్యాటింగ్ చేస్తోన్న ముంబై భారీ స్కోర్ దిశగా పయనిస్తోంది. గురువారం మధ్యాహ్నం లంచ్ విరామం సమయానికి తొలి ఇన్నింగ్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. మిడిలార్డర్ బ్యాటర్ సర్ఫరాజ్ ఖాన్ 119, తుషార్ దేశ్పాండే ఆరు పరుగులతో నాటౌట్గా ఉన్నారు.
కేప్టెన్ పృథ్వీ షా-47, యశస్వి జైస్వాల్-78, అర్మాన్ జాఫర్-26, సువేద్ పార్కర్-18, హార్దిక్ తమోరె-24, షామ్స్ ములాని-12, తనుష్ కొటియాన్-15, ధవల్ కులకర్ణి-1 పరుగులు చేసి అవుట్ అయ్యారు. మధ్యప్రదేశ్ బౌలర్లు అనుభవ్ అగర్వాల్-3 వికెట్లు తీసుకున్నాడు. సారాంశ్ జైన్-2, గౌరవ్ యాదవ్-2, కుమార్ కార్తికేయ ఒక వికెట్ పడగొట్టారు. ముంబై బ్యాటర్లలో సర్ఫరాజ్ ఖాన్ మాత్రం బౌలర్లకు కొరుకుడు పడలేదు.

మధ్యప్రదేశ్ బౌలర్లను సమర్థవంతంగా ఎదుర్కొన్నాడు. 224 బంతుల్లో 119 పరుగులు చేశాడీ బ్యాటర్. ఇందులో ఒక సిక్సర్, 13 ఫోర్లు ఉన్నాయి. లంచ్ విరామం సమయానికి సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వరుసగా వికెట్లు పడుతున్న సమయంలో వచ్చిన సర్ఫరాజ్ క్రీజ్లోకి పాతుకు పోయాడు. పరిస్థితులకు అనుగుణంగా ఆడాడు. ప్రారంభంలో కుదురుకోవడానికి ఎక్కువ బంతులను తీసుకున్న అతను.. ఆ తరువాత ధాటిగా ఆడాడు.
రంజీల్లో సర్ఫరాజ్ ఖాన్ సూపర్ ఫామ్లో ఉన్నాడు. క్వార్టర్ ఫైనల్లో సెంచరీ నమోదు చేశాడు. సెమీ ఫైనల్స్లో హాఫ్ సెంచరీ, 40తో సత్తా చాటాడు. ఫైనల్స్లో ఏకంగా సెంచరీ బాదాడు. లంచ్ విరామ సమయానికి 119 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. వరుసగా రెండు సీజన్లలో అతను 900లకు పైగా స్కోర్ చేశాడు. ఈ రెండు సీజన్లల్లో ఆరు మ్యాచ్లల్లోనే 900లకు పైగా పరుగులు చేసిన బ్యాటర్గా చరిత్ర సృష్టించాడు. సెంచరీ చేసిన తరువాత సర్ఫరాజ్ తన భావోద్వేగాన్ని దాచుకోలేకపోయాడు.. ఏడ్చేశాడు.