ఒంటరిగా వెళ్లొద్దు
తమ ఆశలను నీరుగార్చిన తమదేశ క్రికెట్ జట్టుపై కారాలు, మిరియాలు నూరుతున్నారు అక్కడి జనం. ఎప్పుడెప్పుడు విమానం దిగుతారా? అని ఆగ్రహావేశాలతో ఎదురు చూస్తున్నారు. ఈ పరిస్థితుల్లో స్వదేశానికి వెళ్లాల్సి వస్తుందనే భయం సర్ఫరాజ్ అండ్ టీమ్ను ఆవహించింది. ఆందోళనకు గురి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో స్వదేశంలో అడుగు పెట్టిన తరువాత ఒంటరిగా ఇంటికి వెళ్లొద్దని సర్ఫరాజ్ అహ్మద్ తన జట్టు సభ్యులకు సూచించినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించిన ఓ కథనాన్ని పాకిస్తాన్కు చెందిన ఓ వెబ్సైట్ ప్రచురించింది.
అలా చేస్తే.. మూర్ఖత్వమే
ఓల్డ్ ట్రాఫొర్డ్లో భారత్తో మ్యాచ్ తరువాత స్వదేశంలో అవాంఛనీయ పరిస్థితులు ఏర్పడ్డాయని, ప్రతికూల వాతావరణం నెలకొని ఉందని సర్ఫరాజ్ అహ్మద్ పేరును ఉటంకిస్తూ ఆ వెబ్సైట్ ఓ వార్తా కథనాన్ని ప్రచురించింది. ఇంటికి వెళ్లేటప్పుడు గానీ, బయట తిరిగేటప్పుడు గానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలని సర్ఫరాజ్ సూచించినట్లు పేర్కొంది. ఎవరైనా ఒంటరిగా బయట తిరిగితే.. అది వారి మూర్ఖత్వమే అవుతుందని ఆయన కాస్త ఘాటుగా వ్యాఖ్యానించినట్లు సమాచారం.
అల్లా దయ తలిస్తే..
అల్లా దయ తలిచి, మిగిలిన మ్యాచ్లల్లో అద్భుతంగా రాణిస్తే తప్ప తమ పరిస్థితులు ఇప్పట్లో మారేలా లేవని సర్ఫరాజ్ తన జట్టు సభ్యులకు హితబోధ చేశారని అంటున్నారు. ఓటమి నుంచి గుణపాఠాన్ని నేర్చుకోవాల్సిన అవసరం ఉందని, మిగిలిన మ్యాచ్లల్లో అద్భుత ప్రదర్శన చేద్దామని ఆయన సూచించారు. జట్టు ఓటమి విషయంలో ఎవరేం వ్యాఖ్యానించినా ఎదురు చెప్పొద్దని సర్ఫరాజ్ చెప్పారు. దేశ ప్రజలు, అభిమానులను తలవంచుకునేలా చేయాల్సి వచ్చినందున అవమానాలను భరించక తప్పదని పేర్కొన్నారట. సర్ఫరాజ్ వారికి హితబోధ చేస్తున్న సమయంలో కోచ్ మిక్కీ అర్థర్ సహా సీనియర్లందరూ డ్రెస్సింగ్ రూమ్లోనే ఉన్నారని చెబుతున్నారు. మిక్కీ అర్థర్ సైతం సర్ఫరాజ్ చేసిన సూచనలు, హితబోధకు ఎదురు చెప్పలేక మౌనంగా ఉన్నట్లు పాక్ వెబ్సైట్ పేర్కొంది.