కరాచి: మాజీ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ మళ్లీ పాకిస్థాన్ జట్టులోకి రీఎంట్రీ ఇచ్చే అవకాశాలు మెండుగా ఉన్నాయి. వచ్చే ఏడాది జనవరిలో బంగ్లాదేశ్తో జరిగే టీ20 సిరీస్ కోసం సర్ఫ్రాజ్ను జట్టులోకి తీసుకోవాలి పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (పీసీబీ) పరిశీలిస్తున్నట్లు సమాచారం తెలుస్తోంది. జనవరి 5న లాహోర్లో పీసీబీ అధికారులు సమావేశం కానున్నారు. జనవరి 6, 7 తేదీల్లో సర్ఫరాజ్ అహ్మద్కి ఫిట్నెస్ టెస్టుని నిర్వహించేలా పీసీబీ షెడ్యూల్ని రూపొందించినట్లు పాక్కి చెందిన ఓ జర్నలిస్ట్ తెలిపాడు. ఈ మేరకు ఓ జాతీయ మీడియా కథనం రాసుకొచ్చింది.
'ఎన్నో చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది.. 2019 వరస్ట్ ఇయర్'
2019లో పేలవ ఫామ్తో నిరాశపరిచిన సర్ఫరాజ్.. కెప్టెన్గానూ జట్టును ముందుండి నడిపించడంలో ఘోరంగా విఫలమయ్యాడు. ముఖ్యంగా ప్రపంచకప్-2019లో సెమీస్ చేరకుండానే ఇంటిబాట పట్టడంతో పాక్ అభిమానులు, మాజీలు అతనిపై మండిపడ్డారు. చాలా చర్చల తర్వాత రెండు నెలల క్రితం సర్ఫ్రాజ్ను కెప్టెన్సీ బాధ్యతల నుంచి పీసీబీ తప్పించింది. ఇక టెస్టు కెప్టెన్గా అజహర్ అలీ, టీ20 కెప్టెన్గా బాబర్ అజామ్ని నియమించింది.
సర్ఫరాజ్ని కెప్టెన్సీ నుంచి తప్పించడమే కాకుండా.. జట్టులో కూడా చోటు ఇవ్వలేదు. పరుగులు చేయడంలో విఫలమవడంతో.. దేశవాళీ క్రికెట్లో ఆడి మళ్లీ ఫామ్ నిరూపించుకోవాలని పీసీబీ సూచించింది. కానీ.. సర్ఫరాజ్ దేశవాళీలో మాత్రం ఆడలేదు. ఇక సర్ఫరాజ్ స్థానంలో జట్టులోకి వచ్చిన వికెట్ కీపర్ మహ్మద్ రిజ్వాన్ ఆకట్టుకోలేకపోయాడు. కీపర్, బ్యాట్స్మెన్గా చెప్పుకోదగ్గ ఒక్క ప్రదర్శన చేయలేదు. దీంతో పీసీబీ మళ్లీ సర్ఫ్రాజ్ను జట్టులోకి తీసుకోవాలని యోచిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.
ప్రపంచకప్లో భాగంగా జరిగిన మ్యాచులో భారత్ చేతిలో 89 పరుగుల తేడాతో పాక్ చిత్తయిన విషయం తెలిసిందే. ఈ మ్యాచ్ సందర్భంగా సర్ఫ్రాజ్ నిద్రముఖంతో కనిపించడంతో పాటు ఆవలింతలతో అందరినీ ఆశ్చర్యానికి గురిచేశాడు. భారత్తో మ్యాచ్ అంటేనే అత్యంత టెన్షన్ ఉంటుందని, అలాంటి మ్యాచ్లో సర్ఫ్రాజ్కు ఎలా ఆవలింతలు వచ్చాయని పాక్ అభిమానులు మండిపడ్డారు. భారత్తో మ్యాచ్ను సీరియస్గా తీసుకోలేదనడానికి ఇది ఓ ఉదాహరణ అని పాక్ నెటిజన్స్ మెమ్స్తో ఏకిపారేశారు.