హైదరాబాద్: పాకిస్థాన్ కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్పై వేటు పడింది. దక్షిణాఫ్రికా ఆల్రౌండర్ ఆండిల్ పెహ్లువాకియాపై జాతి వివక్ష వ్యాఖ్యలు చేసినందుకు గాను ఐసీసీ నాలుగు మ్యాచ్ల నిషేధం విధిస్తూ ఆదివారం నిర్ణయం తీసుకుంది. ఇది వెంటనే అమల్లోకి రానుంది. దీంతో దక్షిణాఫ్రికాతో మిగిలిన రెండు వన్డేలతో పాటు ఫిబ్రవరి 1న మొదయ్యే రెండు టీ20 సిరిస్కు సర్ఫరాజ్ దూరమయ్యాడు.
3rd ODI: న్యూజిలాండ్ బ్యాటింగ్, ధోనికి విశ్రాంతి, తుది జట్టులోకి పాండ్యా
ఈ సమయంలో సీనియర్ ఆటగాడు షోయబ్ మాలిక్ తాత్కాలిక కెప్టెన్గా వ్యహరించనున్నాడు. సర్ఫరాజ్ తాను చేసిన తప్పును అంగీకరించాడని, ఇది తమ జాతి వివక్ష వ్యతిరేక కోడ్ను ఉల్లంఘించడమేనని ఐసీసీ పేర్కొంది. ఆటగాళ్లను వ్యక్తిగతంగా గానీ, వర్ణ, జాతి వివక్షలు, అంపైర్లపై అసహనాన్ని ప్రదర్శిచడం ఐసీసీ ప్రవర్తనా నియమావళిని అతిక్రమించడమేనని పేర్కొంది.
"జాతి వివక్షను ప్రేరేపించే ఎలాంటి చర్యలనైనా ఐసీసీ ఉపేక్షించదు. ఫెల్కువాయోను ఉద్దేశిస్తూ సర్ఫరాజ్ చేసిన వ్యాఖ్యలను పరిగణనలోకి తీసుకున్నాం. మనోభావాలను దెబ్బతీసేలా వ్యవహరించిన సర్ఫరాజ్ తీరును తప్పుబడుతూ సస్పెన్షన్ నిర్ణయం తీసుకోవడం జరిగింది" అని ఐసీసీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రిచర్డ్సన్ పేర్కొన్నాడు.
అసలేం జరిగింది?
గత మంగళవారం జరిగిన రెండో వన్డేలో ఫెలుక్వాయోను ఉద్దేశించి 'ఒరేయ్.. నల్లోడా! ఈరోజు మీ అమ్మ ఎక్కడ కూర్చుంది? నీకు ఏం కావాలని ఆమెను అడిగావు' అని సర్ఫరాజ్ దూషించిన వ్యాఖ్యలు స్టంప్స్మైక్లో రికార్డు కావడంతో అటు మాజీ క్రికెటర్లతో పాటు ఇటు అభిమానులు సైతం ఆగ్రహం వ్యక్తం చేశారు.
దీనిపై దక్షిణాఫ్రికా జట్టు అధికారికంగా ఫిర్యాదు చేయకపోయినా ఐసీసీ స్వతంత్ర విచారణ చేపట్టింది. మ్యాచ్ తర్వాతి రోజు సర్ఫరాజ్ దీనిపై క్షమాపణలు కోరాడు. 'మ్యాచ్లో అసహనాన్ని ప్రదర్శిస్తూ నేను చేసిన వ్యాఖ్యలతో ఎవరైనా బాధపడితే మన్నించండి. ఎవరినీ కావాలని ఆ మాటలు అనలేదు. మరెవరినీ బాధపెట్టే ఉద్దేశం నాకు లేదు. ప్రపంచవ్యాప్తంగా సహచర క్రికెటర్లను నేను ఎప్పుడైనా గౌరవిస్తాను' అని సర్ఫరాజ్ ట్వీట్ చేశాడు.
కాగా దక్షిణాఫ్రికాతో ఆదివారం జరిగిన నాలుగో వన్డేలో పాక్ 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది.