
హైదరాబాద్: ప్రపంచకప్లో టీమిండియా చేతిలో ఎదురైన ఓటమి తర్వాత ఓ అభిమాని తననుద్దేశించి చేసిన వ్యాఖ్యతో తన భార్య కన్నీరుమున్నీరైందని పాకిస్తాన్ జట్టు కెప్టెన్ సర్ఫరాజ్ అహ్మద్ తెలిపాడు. జూన్ 16న మాంచెస్టర్ వేదికగా టీమిండియాతో జరిగిన మ్యాచ్లో పాకిస్థాన్ 89 పరుగుల తేడాతో చిత్తుగా ఓడిన సంగతి తెలిసిందే.
ఐసీసీ క్రికెట్ వరల్డ్కప్-2019 ప్రత్యేక వార్తల కోసం
ఈ మ్యాచ్ అనంతరం సర్ఫరాజ్ లండన్లోని వెస్ట్ఫీల్డ్లోని షాపింగ్ సెంటర్కు షాపింగ్కు వెళ్లాడు. ఈ సమయంలో సర్ఫరాజ్ను ఓ అభిమాని సెల్ఫీ అడిగాడు. దీనికి సర్ఫరాజ్ సైతం అంగీకరించాడు. అదే సమయంలో సర్ఫరాజ్ కొడుకు ఏడుస్తుండటంతో పక్కకు వెళ్లిపోయాడు. దీంతో ఆ అభిమాని "సర్ఫరాజ్ బాయ్.. ఎందుకిలా పందిలా బలిసావు. కొంచెం డైట్ చేయవచ్చు కదా" అంటూ ఘోరంగా అవమానపరిచాడు.
సర్ఫరాజ్ ఏ మాత్రం ఆగ్రహానికి గురవ్వకుండా ప్రశాంతంగా అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయింది. 'ఆ అభిమాని చేసిన వ్యాఖ్యకు సంబంధించిన వీడియో చూసి నా భార్య బోరుమంది. అయితే మన క్రికెట్ అభిమానులు చాలా ఎమోషనల్ అలానే అంటారు అని ఆమెను అనునయించా' అని సర్ఫ్రాజ్ వెల్లడించాడు.
మరోవైపు ఆ వీడియో వైరల్ కావడంతో అభిమానులంతా సర్ఫ్రాజ్కు మద్దతుగా నిలిచారు. దాంతో ఆ అభిమాని తప్పుతెలుసుకొని సర్ఫ్రాజ్కు క్షమాపణలు చెప్పాడు. మాజీ కెప్టెన్ వసీమ్ అక్రమ్ తనకు అలాంటి పరిస్థితి ఎదురైతే తప్పకుండా ఆ అభిమాని చెంపచెళ్లుమనేదని అన్నాడు. అలాంటి పదజాలం వాడటాన్ని అక్రమ్ తీవ్రంగా ఆక్షేపించాడు.
మరోవైపు ప్రపంచకప్లో పుంజుకున్న పాక్ జట్టుపై ప్రశంసల వర్షం కురిసింది. భారత్ చేతిలో ఓటమితో తీవ్ర విమర్శలు ఎదుర్కొన్న పాక్ వరుస మ్యాచ్ల్లో దక్షిణాఫ్రికా, న్యూజిలాండ్పై విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ దేశ అభిమానులు సర్ఫరాజ్ను క్షమించాల్సిందిగా కోరారు.