వీరోచితంగా పోరాడిన అయ్యార్, శార్దూల్, సంజూ
భారత్ - సౌతాఫ్రికా మధ్య మూడు వన్డేల సిరీస్లో భాగంగా లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో తొలుత బ్యాటింగ్కు దిగిన సౌతాఫ్రికా నిర్ణీత 40ఓవర్లలో 4వికెట్లు కోల్పోయి 249పరుగులు చేసింది. ఇక 250పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన భారత టాపార్డర్ బ్యాటర్లు నత్తను తలపించారు. వన్డే అన్న విషయమై మర్చిపోయి పూర్తి డిఫెన్స్ అప్రోచ్తో టెస్ట్ స్థాయిలో ఆడారు. అయితే శ్రేయస్ అయ్యార్ (50 పరుగులు 37బంతుల్లో 8ఫోర్లు) ఫిఫ్టీకి తోడు.. సంజూ శాంసన్ (86పరుగులు 63బంతుల్లో 9ఫోర్లు 2సిక్సర్లు), శార్దూల్ ఠాకూర్ ( 33పరుగులు 31బంతుల్లో 5ఫోర్లు ) వీరోచితంగా పోరాడారు.
భారత్ 8వికెట్లు కోల్పోయి 40ఓవర్లలో 240 పరుగులు చేసింది. తద్వారా 9పరుగుల స్వల్ప తేడాతో ఓటమి పాలయింది. సౌతాఫ్రికా బౌలర్లలో రబాడ 2, లుంగి ఎంగిడి 3, పార్నెల్, మహరాజ్, షమ్సీ తలా ఓ వికెట్ తీశారు. షమ్సీ తన 8ఓవర్లలో ఏకంగా 89పరుగులు ఇవ్వడం గమనార్హం.
టాపార్డర్ నత్తను తలపించి..
ఇక భారత బ్యాటింగ్ టైంలో తొలి స్పెల్ వేసిన రబాడ, పార్నెల్ భీకర బంతులతో రెచ్చిపోయారు. వారి ధాటికి స్కోరు బోర్డు తాబేలును తలపించింది. మూడో ఓవర్లో రబాడ గిల్ (3)ను క్లీన్ బౌల్డ్ చేశాడు. 3, 4, 5 మూడు ఓవర్లు మెయిడిన్ అయ్యాయి. ఇక ఆరో ఓవర్ తొలి బంతికి ధావన్ (4పరుగులు 16బంతుల్లో) కట్ బౌల్డ్ అయ్యాడు. ఆ తర్వాత క్రీజులో నిలిచిన ఇషాన్ కిషన్, రుతురాజ్ గైక్వాడ్ టెస్ట్ అన్నట్లు ఆడుతూ.. సౌతాఫ్రికా బౌలర్లకు మరింత ఊపునిచ్చారు.
వీరి మందకొడి బ్యాటింగ్కు స్కోరు బోర్డు మరింత మందగించింది. రుతురాజ్ గైక్వాడ్ తీవ్రంగా తడబడ్డాడు. అప్పటికే ఓ రనౌట్ మిస్సయినా.. అతను వచ్చిన లైఫ్ ఉపయోగించుకోలేకపోయాడు. వీరిద్దరు ఎలాగోలా 40పరుగుల భాగస్వామ్యాన్ని నమోదు చేశారు. అయితే 17ఓవర్లకు స్కోరు 48పరుగులే అయింది. ఇక ఆ ఓవర్లో గైక్వాడ్ (19పరుగులు 42బంతుల్లో 1ఫోర్) షమ్సీ బౌలింగ్లో ఔటయ్యాడు. ఆ తర్వాత కేశవ్ మహరాజ్ బౌలింగ్లో ఇషాన్ కిషన్ (20పరుగులు 37బంతుల్లో 3ఫోర్లు) కూడా ఔటయ్యాడు.
ఉన్నంత సేపు ఊపిన శ్రేయస్
దీంతో 51పరుగులకే 4వికెట్లు కోల్పోయి తీవ్ర కష్టాల్లో పడ్డ ఇండియాకు కాసేపు శ్రేయస్ అయ్యార్ తన క్లాసిక్ ఇన్నింగ్స్తో ఊపుతెచ్చాడు. ఎటాకింగ్ గేమ్ ఆడుతూ సౌతాఫ్రికా బౌలర్లపై రెచ్చిపోయాడు. షమ్సీ వేసిన 19వ ఓవర్లో శ్రేయస్ 4బాదగా.. సామ్సన్ సిక్స్ కొట్టాడు. దీంతో ఆ ఓవర్లో 15పరగులొచ్చాయి. ఆ తర్వాత శ్రేయస్ అయ్యార్ షమ్సీ తర్వాత ఓవర్లో వరుసగా మూడు బౌండరీలు బాది స్కోరు బోర్డు వేగం పెంచాడు.
ఎంగిడి వేసిన 23వ ఓవర్లో రెండు ఫోర్లు కొట్టాడు. ఇక సామ్సన్ కాస్త నెమ్మదించాడు. 26వ ఓవర్లో ఫోర్ కొట్టి సింగిల్ తీసి శ్రేయస్ అయ్యార్ వన్డేల్లో తన 12వ హాఫ్ సెంచరీని పూర్తిచేసుకున్నాడు. కేవలం 33బంతుల్లోనే శ్రేయస్ ఫిఫ్టీ చేయడం గమనార్హం. మరో వైపు మిగతా బ్యాటర్లు తడబడుతున్న వేళ శ్రేయస్ ఆడిన ఇన్నింగ్స్ అందరినీ ఆకట్టుకుంది. అయితే అప్పటికే రిక్వయిడ్ రన్ రేట్ భారీగా పెరిగిపోవడంతో ఎంగిడి బౌలింగ్లో హిట్ చేయాలనుకుని లాంగాఫ్లో క్యాచ్ ఔట్ అయ్యాడు.
థాకూర్తో కలిసి సంజూ ఇన్నింగ్స్
ఇక శ్రేయస్ ఔటయినప్పటికీ.. ఛేదన బాధ్యతలను సంజూ శాంసన్ తీసుకున్నాడు. చాలా మొండిగా క్రీజులో నిలబడి.. శార్దూల్తో కలిసి భీకర పోరాటాన్ని కనబరిచాడు. శ్రేయస్ ఔటయ్యే సరికి స్కోరు భారత్ 78బంతుల్లో 132పరుగులు చేయాలి. ఇక ఈ తరుణంలో దక్షిణాఫ్రికా గెలుపు లాంఛనమే అనిపించింది. అయితే క్రీజులోకి వచ్చిన శార్దూల్ అడపాదడపా ఫోర్లు బాదడంతో పాటు సంజూ సమయోచితంగా పరుగులు రాబడుతూ.. స్కోరు బోర్డును ముందుకు నడిపించారు. వచ్చీ రాగానే 27వ ఓవర్లో ఫోర్ బాదిన శార్దూల్.. 28వ ఓవర్లోను ఫోర్ బాదాడు.
ఇక షమ్సీ వేసిన 30ఓవర్లో రెండు సార్లు థాకూర్ ఎల్బీడబ్ల్యూ నుంచి తప్పించుకున్నాడు. సౌతాఫ్రికా ఫాల్స్ రివ్యూలు తీసుకుని రివ్యూలు కోల్పోయింది. 33వ ఓవర్ వరకు కుదురుగా ఆడిన సంజూ.. ఆ ఓవర్ నుంచి తన క్లాసిక్ షాట్లతో అలరించాడు. పార్నెల్ వేసిన ఆ ఓవర్లో రెండు ఫోర్లు బాదాడు. ఎంగిడి వేసిన 35వ ఓవర్లో సిక్స్ బాదాడు. షమ్సీ వేసిన 36 ఓవర్ చివరి రెండు బంతులకు రెండు ఫోర్లు బాదాడు. ఆ ఓవర్లో సంజూ తన హాఫ్ సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. ఇది సంజూకు రెండో వన్డే ఫిఫ్టీ.
చివర్లో సంజూ మాస్టర్ క్లాస్
24బంతుల్లో 59 పరుగులు అవసరమైన దశలో రబాడా వేసిన 37వ ఓవర్లో థాకూర్ మూడు ఫోర్లు కొట్టడంతో ఆ ఓవర్లో 14పరుగులొచ్చాయి. అయితే 38వ ఓవర్లో మ్యాచ్ మలుపు తిరిగింది. ఆ ఓవర్లో థాకూర్ (33పరుగులు 31బంతుల్లో 5ఫోర్లు) ఔటవ్వడంతో పాటు కుల్దీప్ (0) కూడా క్యాచ్ ఔటయ్యాడు. దీంతో మ్యాచ్ మరింత రసవత్తరంగా మారిపోయింది.
ఇక రబాడా వేసిన 39వ ఓవర్లో అవేష్ ఖాన్ (3పరుగులు 6బంతుల్లో) నాలుగు బాల్స్ మింగడంతో పాటు ఔట్ కాగా.. నోబాల్కు ఔటయిన రవి బిష్ణోయ్.. ఫ్రీ హిట్ బంతికి ఫోర్ బాదాడు. దీంతో చివరి ఓవర్లో 6బంతుల్లో 30పరుగులు చేయాల్సి వచ్చింది. ఇక క్రీజులో సంజూ శాంసన్ ఉండడం, చివరి ఓవర్ స్పిన్నర్ అయిన తబ్రైజ్ షమ్సీ వేయడంతో మ్యాచ్ మజా వచ్చింది. అయితే ఆ ఓవర్లో 21పరుగులు రావడంతో 9పరుగుల తేడాతో సౌతాఫ్రికా గెలిచింది.
అంతకుముందు మిల్లర్, క్లాసెన్ రెచ్చిపోవడంతో..
అంతకుముందు దక్షిణాఫ్రికా బ్యాటర్లలో క్వింటన్ డికాక్ (48పరుగులు 54బంతుల్లో 5ఫోర్లు) ఆకట్టుకోగా.. డేవిడ్ మిల్లర్ (75పరుగులు 63బంతుల్లో 5ఫోర్లు 3సిక్సర్లు నాటౌట్), హెన్రిచ్ క్లాసెన్ (74పరుగులు 65బంతుల్లో 6ఫోర్లు 2సిక్సర్లు నాటౌట్) హాఫ్ సెంచరీలతో కడవరకు నిలిచి కీలక ఇన్నింగ్స్ ఆడి జట్టు స్కోరును 249కి తీసుకెళ్లారు. భారత బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2, అరంగేట్ర బౌలర్ రవి బిష్ణోయ్ 1, కుల్దీప్ యాదవ్ 1 వికెట్ తీశారు.