హైదరాబాద్: కేరళ క్రికెటర్ సంజూ శాంసన్ యో-యో టెస్టు పాలయ్యాడు. బుధవారం జాతీయ క్రికెట్ అకాడమీలో యో-యో టెస్టుకు హాజరైన సంజూ శాంసన్ 17.3 పాయింట్లతో విజయవంతంగా టెస్టును పాసయ్యాడు. యో-యో టెస్టులో ఫెయిల్ కావడంతో గత నెలలో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లిన ఇండియా-ఏ జట్టులో సంజూ శాంసన్ చోటు కోల్పోయిన సంగతి తెలిసిందే.
యో-యో టెస్టు అర్హత మార్కు 16.1 కాగా, గత నెలలో యో-యో టెస్టుకు హాజరైన సంజూ శాంసన్ కేవలం 15.6 పాయింట్లు మాత్రమే సాధించడంతో ఇంగ్లాండ్ పర్యటనకు వెళ్లే భారత్-ఏ జట్టులో చోటు కోల్పోయాడు. ఈ ఏడాది ముగిసిన ఐపీఎల్ 2018 సీజన్లో రాజస్థాన్ రాయల్స్కు ప్రాతినిథ్యం వహించిన సంజూ శాంసన్ అద్భుత ప్రదర్శన చేశాడు.
టోర్నీ మొత్తంలో ఆ జట్టు తరుపున అత్యధిక పరుగులు చేసిన ఆటగాడిగా సంజూ శాంసన్ నిలిచాడు. అయితే, యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇండియా-ఏ పర్యటనకు అతడి స్థానంలో సెలక్టర్లు ఇషాన్ కిషన్ను ఎంపిక చేశారు. ఆ తర్వాత మహమ్మద్ షమీ, అంబటి రాయుడు యో-యో టెస్టులో విఫలం కావడంతో ఇంగ్లాండ్ పర్యటన నుంచి వారిని తప్పించారు.
టీమిండియాకు ప్రాతినిథ్యం వహించాలంటే యో-యో టెస్టు తప్పనిసరి అంటూ హెడ్ కోచ్ రవిశాస్త్రి ఇప్పటికే స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ప్రపంచంలోని అగ్రశ్రేణి క్రికెట్ జట్లతో పోలిస్తే ఈ మార్కులు చాలా తక్కువ. న్యూజిలాండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక, దక్షిణాఫ్రికాతో పాటుతో మన దాయాది దేశమైన పాకిస్థాన్ జట్టు కూడా యో-యో టెస్టులో పాసవ్వాలంటే భారత్ కంటే ఎక్కువ మార్కులనే నిర్దేశించాయి.
ఇంగ్లాండ్, న్యూజిలాండ్, ఆస్ట్రేలియా జట్లకి ఆయా దేశాల క్రికెట్ బోర్డులు తమ ఆటగాళ్లు యో-యో ఫిట్నెస్ టెస్టులో పాసవ్వాలంటే కనీసం 19 మార్కులు రావాలని నిబంధన విధించగా.. దక్షిణాఫ్రికా 18.5, శ్రీలంక 17.4, పాకిస్థాన్ 17.4 మార్కులు సాధించాలని నిబంధన పెట్టినట్లు తేలింది.
దీంతో, టీమిండియా ప్రధాన కోచ్ రవిశాస్త్రి ఇటీవల యో-యో టెస్టు పాస్ మార్కుల పెంపుపై బీసీసీఐతో చర్చించినట్లు వార్తలు వచ్చాయి. ప్రస్తుతం యో-యో ఫిట్నెస్ టెస్టులో ఉత్తీర్ణత సాధించాలంటే సదరు క్రికెటర్ కనీసం 16.1 పాయింట్లు సాధించాల్సి ఉంటుంది. అయితే దీనిని 16.3కి పెంచాలనే యోచనలో బీసీసీఐ ఉంది.