హైదరాబాద్: ఇంగ్లాండ్తో జరుగుతున్న మూడు వన్డేల సిరిస్లో నాలుగో స్థానంలో బరిలోకి దిగిన కేఎల్ రాహుల్ విఫలమైన సంగతి తెలిసిందే. వచ్చే ఏడాది జరిగే వరల్డ్ కప్ను దృష్టిలో పెట్టుకుని ఈ స్ధానం కోసం సరైన బ్యాట్స్మన్ కోసం టీమిండియా ప్రయోగాలు చేస్తోన్న సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఇంగ్లాండ్తో జరుగుతున్న నాలుగు వన్డేల సిరిస్లో దినేశ్ కార్తీక్ను కాదని సురేశ్ రైనాను తుది జట్టులోకి తీసుకోవడానికి కారణంపై టీమిండియా అసిస్టెంట్ కోచ్ సంజయ్ బంగర్ వివరణ ఇచ్చాడు. ఇరు జట్ల మధ్య మంగళవారం మూడో వన్డే జరగనుంది.
సిరిస్ విజేత ఎవరో నిర్ణయించే వన్డే కాడవంతో ఈ వన్డేపై ఆసక్తి నెలకొంది. ఈ వన్డేకి ముందు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో దినేశ్ కార్తీక్ను కాదని రైనాకు ఎందుకు తుది జట్టులో అవకాశం ఇస్తున్నారని విలేకరులు ప్రశ్నించారు. ఇందుకు సంజయ్ బంగర్ మాట్లాడుతూ...
"మిడిలార్డర్లో ఎడమ చేతి బ్యాట్స్మెన్ను ఆడించాలని ప్లాన్ చేసుకున్నాం. ఇందులో భాగంగానే దినేశ్ను కాదని రైనాకు అవకాశం ఇస్తున్నాం. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్కు ముందు భారత్ పదిహేనుకు పైగా వన్డేలు ఆడనుంది. ఈ వన్డేల ద్వారా పలువురి ఆటగాళ్లకు అవకాశం ఇచ్చి మిడిలార్డర్ను బలోపేతం చేయడానికి ప్రయత్నిస్తాం" అని చెప్పాడు.
"ఇప్పుడు బ్యాటింగ్ చేస్తున్న ఆటగాళ్లు భవిష్యత్తులో అదే స్థానంలో తప్పనిసరిగా బ్యాటింగ్ చేస్తారని చెప్పలేను. వారి స్థానాల్లో మార్పులు చోటు చేసుకోవచ్చు. వరల్డ్ కప్ నాటికి టీమిండియా బెంచ్ను మరింత బలంగా తయారు చేసుకునేందుకే ఈ ప్రయత్నాలు" అని బంగర్ పేర్కొన్నాడు.
దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్తో లీడ్స్ వేదికగా జరిగే మూడో వన్డేలో టీమిండియాలో రెండు మార్పులు చోటు చేసుకునే అవకాశం ఉంది. గాయం కారణంగా తొలి రెండు వన్డేలకు దూరమైన భువనేశ్వర్ కుమార్తో పాటు రైనా స్థానంలో దినేశ్ కార్తీక్కు చోటు దక్కే అవకాశాలు ఉన్నాయి.