
హైదరాబాద్: పల్లెకెలె వేదికగా ఆతిథ్య శ్రీలంక జట్టుతో జరుగుతున్న రెండో టెస్టులో ఇంగ్లాండ్ క్రికెటర్ శామ్ కుర్రన్ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ మ్యాచ్లో శామ్ కుర్రన్(64: 119 బంతుల్లో ఒక ఫోర్, 6 సిక్సులు) సాయంతో హాఫ్ సెంచరీతో చెలరేగాడు.
ఈ మ్యాచ్లో శామ్ కుర్రన్ సిక్స్తో హాఫ్ సెంచరీని అందుకోవడం విశేషం. తద్వారా వరుసగా మూడు టెస్టుల్లో సిక్స్ బాది హాఫ్ సెంచరీలను అందుకున్న తొలి ఆటగాడిగా శామ్ కుర్రన్ అరుదైన ఘనత సాధించాడు. ఈ ఏడాది జూన్లో లీడ్స్ వేదికగా పాకిస్థాన్తో జరిగిన మ్యాచ్లో శామ్ కుర్రన్ అంతర్జాతీయ టెస్టు అరంగేట్రం చేశాడు.
ప్రస్తుతం శ్రీలంకతో జరుగుతున్న టెస్టు శామ్ కుర్రన్కు ఏడోది కావడం విశేషం. ఇప్పటివరకు ఏడు టెస్టులాడిన శామ్ కుర్రన్ 404 పరుగులు చేశాడు. టెస్టుల్లో కుర్రన్ అత్యధిక వ్యక్తిగత స్కోరు 78. సౌతాంప్టన్ వేదికగా టీమిండియాతో జరిగిన టెస్టులో కుర్రన్ ఈ పరుగులు సాధించాడు.
పల్లెకెలె వేదికగా బుధవారం ప్రారంభమైన రెండో టెస్టులో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న ఇంగ్లాండ్ జట్టులో జోస్ బట్లర్(63), శామ్ కుర్రన్(64) హాఫ్ సెంచరీలతో రాణించడంతో 75.4 ఓవర్లలో 285 పరుగులు చేసి ఆలౌటైంది. లంక బౌలర్లలో దిల్రువాన్ పెరీరా నాలుగు, పుష్పకుమార మూడు, ధనుంజయ రెండు, సురంగ లక్ష్మల్ ఒక వికెట్ తీసుకున్నారు.
అనంతరం ఇన్నింగ్స్ను ప్రారంభించిన శ్రీలంక తొలి రోజు ఆట ముగిసే సమయానికి 12 ఓవర్లకు గాను వికెట్ నష్టానికి 26 పరుగులు చేసింది. ఇంగ్లాండ్ బౌలర్లలో జాక్ లీచ్ ఒక వికెట్ పడగొట్టాడు. రెండు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా గాలే వేదికగా జరిగిన తొలి టెస్టులో ఇంగ్లాండ్ విజయం సాధించిన సంగతి తెలిసిందే.
జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు క్రీజులోకి దిగి హాఫ్ సెంచరీ సాధించిన శామ్ కుర్రన్పై సోషల్ మీడియాలో ప్రశంసల వర్షం కురుస్తోంది.