గత కొన్ని వారాలుగా చాలా మంది మాజీ ప్లేయర్లు వన్డేల భవితవ్యంపై ప్రశ్నలు సంధిస్తున్నారు. ఇటీవల పాకిస్థాన్ మాజీ దిగ్గజ ఫాస్ట్ బౌలర్ వసీం అక్రమ్ కూడా వన్డే క్రికెట్ 'డ్రాగ్'గా మారిందని.. వన్డే ఫార్మాట్ చావు అంచుల్లో ఉందని అభిప్రాయం వ్యక్తం చేశాడు. తాజాగా పాక్ మాజీ ఓపెనర్ సల్మాన్ భట్ వన్డే ఫార్మాట్ గురించి తన అభిప్రాయాలను వెల్లడించాడు. వన్డేలు, టీ20ల మధ్య ఓ ప్రధాన తేడా ఉందన్నాడు. ప్రపంచవ్యాప్తంగా టీ20 ఫార్మాట్లో లీగ్లు నడుస్తాయని, టీ20 ఫార్మాట్ ద్వారా కాసులు కురుస్తాయని.. అది వన్డే ఫార్మాట్లో అవకాశం లేదని పేర్కొన్నాడు. ఇకపోతే వసీం అక్రమ్ వన్డేలపై ప్రస్తావించిన అభిప్రాయాన్ని తాను గౌరవిస్తానన్న భట్.. వన్డేల్లోనే 500కు పైగా వసీం అక్రమ్ వికెట్లు తీశాడనే విషయాన్ని మర్చిపోవద్దన్నాడు. ప్రపంచకప్ సందర్భంగా అక్రమ్ వేసిన రెండు ఐకానిక్ డెలివరీలు టీ20క్రికెట్లో సాధ్యమయ్యేవి కాదన్నాడు. ఎందుకంటే టీ20 ఫార్మాట్లో వన్డే ఫార్మాట్ లాగా పుంజుకోవడానికి తగినంత టైం ఉండదన్నాడు.
తమకు ఎక్కువ డబ్బు వస్తున్నందున ప్లేయర్లు టీ20లను విడిచిపెట్టడానికి ఇష్టపడరని భట్ చెప్పాడు. ఒకవేళ బిజీబిజీ షెడ్యూళ్ల వల్ల ప్లేయర్లు అలసిపోయినా.. కాస్త విరామం కోరుకోవాలనుకున్నా.. వాళ్లు వన్డేలకే గుడ్ బై చెప్తారని అభిప్రాయపడ్డాడు. ఎందుకంటే టీ20ల్లో, టెస్ట్ క్రికెట్లో వాళ్లు డబ్బు ఎక్కువగా సంపాదించగలరు. అందువల్ల వాళ్లు వన్డేలకు దూరంగా ఉండడానికే మొగ్గుచూపుతారని ప్రస్తావించాడు. ఇకపోతే వన్డే ఫార్మాట్ క్రికెట్కు మూలస్తంభం లాంటిదని, వన్డే ఫార్మాట్ ఎప్పటికీ ముగిసిపోకూడదని తాను కోరుకుంటానని చెప్పాడు.
ఇకపోతే ఇటీవల భారత ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్ వన్డేలు చూస్తున్నప్పుడు.. ఓ టైం తర్వాత తాను టీవీని స్విచ్ ఆఫ్ చేస్తాను అని చెప్పాడు. అలాగే ఆస్ట్రేలియా ఆటగాడు ఉస్మాన్ ఖవాజా కూడా వన్డే క్రికెట్ "చనిపోతుంది" అని పేర్కొన్నాడు. భారత మాజీ బ్యాటర్ ఆకాశ్ చోప్రా కూడా కొన్ని వారాల క్రితం వన్డే క్రికెట్ భవిష్యత్తు ఆందోళనకరమని అభిప్రాయపడ్డాడు.