రాంచీ: కరోనా దెబ్బతో యావత్ ప్రపంచం అతలాకుతలమవ్వగా.. క్రీడాలోకం పూర్తిగా స్థంభించింది. పైగా ఈ ప్రాణాంతక వైరస్ నిర్మూలన కోసం ప్రపంచంలోని చాలా దేశాలు లాక్డౌన్ పాటిస్తున్నాయి. దీంతో స్టార్ ప్లేయర్లంతా ఇంటికే పరిమితమయ్యారు. కుటుంబ సభ్యులతో హాయిగా గడుపుతున్నారు.
ఇక కరోనా దెబ్బతో ఇళ్లలో పని చేసే సిబ్బంది కూడా రాకపోవడంతో ఎవరి పనులు వారు చేసుకుంటున్నారు. ఇళ్లు శుభ్రం చేయడం.. బట్టలు సర్దడం.. మాఫ్ కొట్టడం.. వంట చేసుకోవడం వంటి పనులన్నే వారే చేసుకుంటున్నారు. స్టార్ క్రికెటర్లు కూడా ఈ పనుల్లో భాగమవుతూ.. ఇవి చేయడం ఎంత కష్టమో సోషల్ మీడియా వేదికగా అభిమానులతో పంచుకుంటున్నారు. ఈ నేపథ్యంలోనే శిఖర్ ధావన్ బాత్రూమ్ క్లీన్ చేయడం.. శ్రేయస్ అయ్యర్ మాఫ్ కొట్టడం.. రోహిత్ ఇళ్లు శుభ్రం చేయడం వంటి పనులను చూశాం.
ఇక సోషల్ మీడియాకు కొంచెం దూరంగా ఉండే ధోనీ ఏం చేస్తున్నాడనే విషయం మాత్రం బయటికి రాలేదు. ఐపీఎల్ వాయిదా పడటం.. చెన్నై ప్రాక్టీస్ సెషన్ రద్దవ్వడంతో కనిపించకుండా పోయిన ధోనీ ఈ లాక్డౌన్లో ఏం చేస్తున్నాడో తెలియలేదు. అయితే తాజాగా ధోనీ ఏం చేస్తున్నాడనే విషయాన్ని సాక్షి సింగ్ అభిమానులతో పంచుకుంది. ఇంతకీ ధోనీ ఏం చేస్తున్నాడో తెలుసా.. అందరీలానే.. తన ఇంటిపనులు తానే చేసుకుంటున్నాడు. తన గార్డెన్లో పెరిగిన గడ్డిని, చెట్ల కొమ్మలను కత్తిరిస్తున్నాడు. దీనికి సంబంధించిన ఫొటోను సాక్షి సింగ్ ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకోగా.. చెన్నై సూపర్ కింగ్స్ ట్వీట్ చేసింది.
Lawn time, no see!#Thala #WhistlePodu 🦁💛
— Chennai Super Kings (@ChennaiIPL) April 9, 2020
PC: @SaakshiSRawat pic.twitter.com/UsWbkU6k0E
ఇక ఈ ఫొటోపై నెటిజన్లు ఫన్నీ కామెంట్స్ చేస్తున్నారు. లాక్డౌన్ వేళ ఇంట్లో పనులు నీకు తప్పలేదా? అని ఒకరంటే.. టీమిండియా స్టారైనా.. పెళ్లాం బాధలు తప్పవని ఇంకొకరు సరదాగా కామెంట్ చేశారు. మా ధోనికి ఎంత కష్టమొచ్చే అని, మిస్ యూ తాల అని ఇంకొందరు కామెంట్ చేస్తున్నారు.
ఇక గతేడాది జరిగిన వన్డే ప్రపంచకప్ అనంతరం మైదానానికి దూరమైన ధోనీ మళ్లీ బ్యాట్ పట్టలేదు. ఐపీఎల్తోనే రీ ఎంట్రీ ఇవ్వాలని భావించాడు. ఈ క్యాష్ రిచ్ లీగ్ కోసం ప్రాక్టీస్ కూడా మొదలు పెట్టాడు. కానీ మార్చి 29న ప్రారంభం కావాల్సిన ఐపీఎల్ వాయిదా పడటం.. ఇప్పడు జరుగుతుందో లేదోననే సందిగ్దత నెలకొనడంతో ఈ జార్ఖండ్ డైనమైట్ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారింది.