
ముంబై: నేడు ప్రపంచ పర్యావరణ దినోత్సవం. ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని ఏటా జూన్ 5న నిర్వహిస్తున్నారు. పర్యావరణానికి అనుకూలమైన చర్యలు చేపట్టి ప్రపంచ అవగాహనను పెంచేలా ఐక్యరాజ్యసమితి (ఐరాస) ఈమేరకు పర్యావరణ దినోత్సవం జరపాలని నిర్ణయించింది. 1973లో మొదటిసారి ప్రపంచ పర్యావరణ దినోత్సవం జరుపుకున్నారు. ఏటా ఒక్కో థీమ్ను ఎంపిక చేసి పర్యావరణ దినోత్సవం నిర్వహిస్తారు. 2020లో 'టైమ్ ఫర్ నేచర్' జర్మనీ సహకారంతో కొలంబియాలో నిర్వహించారు. ఈ ఏడాది RRR (Reimagine, Recreate, Restore) థీమ్తో పర్యావరణ దినోత్సవాన్ని నిర్వహిస్తున్నారు.
ప్రపంచ పర్యావరణ దినోత్సవం రోజు క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ తన అభిమానులకు మంచి సందేశం ఇచ్చారు. చెట్లను నాటి ఈ ప్రకృతిని కాపాడాలని ఆయన పిలుపునిచ్చారు. కాలుష్యంతో ప్రమాదకరంగా మారుతున్న ఈ నేలతల్లిని తమవంతుగా బాగుచేయాలని కోరారు. ఈ క్రమంలోనే సచిన్ కూడా తన వ్యవసాయ క్షేత్రంలో విత్తనాలు నాటి మొక్కలను పెంచారు. అందుకు సంబంధించిన వీడియోను సోషల్ మీడియాలో పంచుకొని ఆనందం వ్యక్తం చేశారు.
'ఈ విత్తనాలు మొక్కలుగా పెరగడం చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. ఇది నమ్మశక్యం కానిది. దీంతో చాలా ఆనందం పొందాను. ఈ అనుభూతిని మాటల్లో చెప్పలేను' అని సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. 'మనల్ని సంతోషంగా, ఆరోగ్యంగా ఉంచడానికి ఈ ప్రకృతి నిరంతరాయంగా పనిచేస్తుంది' అని పేర్కొన్నారు. సచిన్తో పాటు పలు ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ఫ్రాంఛైజీలు సైతం పర్యావరణ పరిరక్షణకు సంబంధించిన పోస్టులు చేశాయి. కాలుష్య కారకాల నుంచి ఈ భూమాతను కాపాడాలని వారంతా అభిమానులను కోరారు.
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదారు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.