1990లో మాంచెస్టర్ వేదికగా ఇంగ్లాండ్పై 119 పరుగులు
సచిన్ టెండూల్కర్కు ఇది తొలి టెస్టు సెంచరీ. ఈ సెంచరీనే ఆ తర్వాత సచిన్ను టెస్టుల్లో 51 సెంచరీలు చేసే విధంగా ప్రేరేపించింది. ఈ టెస్టులో ఇంగ్లాండ్ కెప్టెన్ గ్రాహామ్ గూచ్ నేతృత్వంలోని ఇంగ్లాండ్ జట్టు చివరి రోజు భారత్కు 408 పరుగుల విజయ లక్ష్యాన్ని నిర్దేశించింది. దీంతో మనోజ్ కుమార్(67 నాటౌట్)తో కలిసి సచిన్ అద్భుత ఇన్నింగ్స్ ఆడటంతో ఈ టెస్టు మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్ ఆడినప్పుడు సచిన్ వయసు 17 ఏళ్ల 112 రోజులు. పాకిస్థాన్ ఆటగాడు ముస్తాక్ మహమ్మద్ తర్వాత టెస్టుల్లో సెంచరీ నమోదు చేసిన రెండో అతి పిన్నవయస్కుడు సచినే కావడం విశేషం.
1992 పెర్త్ వేదికగా ఆస్ట్రేలియాపై 114 పరుగులు
ఐదు టెస్టు మ్యాచ్ల సిరిస్ కోసం టీమిండియా ఆసీస్ పర్యటనకు వెళ్లింది. అప్పటికే నాలుగు టెస్టుల్లో టీమిండియా ఓటమి పాలైంది. పెర్త్ వేదికగా జరిగిన ఈ టెస్టు సిరిస్లో చివరిది. ఈ టెస్టులో ఆస్ట్రేలియా 300 పరుగుల తేడాతో విజయం సాధించింది. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా దిగ్గజ బౌలర్లు మెక్ డార్మెట్, హ్యూస్, వైట్నీలను ధీటుగా ఎదుర్కొని సచిన్ టెండూల్కర్ సెంచరీ నమోదు చేయడం విశేషం. ఈ టెస్టు తొలి ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా 346 పరుగులకు ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 272 పరుగులకే ఆలౌటైంది. తొలి ఇన్నింగ్స్లో సచిన్ 161 బంతుల్లో 16 ఫోర్ల సాయంతో 114 పరుగులు నమోదు చేశాడు. ఇక, రెండో ఇన్నింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియా 367/6 వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 141 పరుగులకే ఆలౌటైంది.
1998 షార్జా వేదికగా ఆస్ట్రేలియాపై 143 పరుగులు
సచిన్ క్రికెట్ చరిత్రలోనే నిలిచిపోయిన సెంచరీ ఇది. క్రికెట్ అభిమానులు ముద్దుగా ఈ ఇన్నింగ్స్ను 'Desert Storm' అని పిలుచుకుంటారు. ఈ మ్యాచ్లో సచిన్ పరుగుల వరద పారించాడు. సచిన్ బాదిన సెంచరీని టీమిండియాను ముక్కోణపు సిరిస్ ఫైనల్కు వెళ్లేలా చేసింది. ఫైనల్కు చేరేందుకు టీమిండియా 46 ఓవర్లలో 237 పరుగులు కావల్సి వచ్చింది. ఆస్ట్రేలియా బౌలర్లు షేన్ వార్న్, డామిన్ ఫ్లెమింగ్, మైకేల్ కాస్ప్రోవిజ్లను బౌండరీలతో సచిన్ హోరెత్తించాడు. అయితే ఈ మ్యాచ్లో ఆస్ట్రేలియా 26 పరుగుల తేడాతో భారత్పై విజయం సాధించినప్పటికీ, టీమిండియా ఫైనల్కు అర్హత సాధించింది. ఫైనల్లో కూడా సచిన్ (134) సెంచరీతో చెలరేగాడు.
2003 సెంచూరియన్ వేదికగా పాకిస్థాన్పై 98
పాకిస్థాన్పై ఎప్పుడు మ్యాచ్ జరిగినా సచిన్ చెలరేగిపోతుంటాడు. ఈ మ్యాచ్లో అబ్దుల్ రజాక్ ఇచ్చిన లైఫ్తో బతికిపోయిన సచిన్ చెలరేగిపోయాడు. పాక్ బౌలర్లను లక్ష్యంగా చేసుకుని బౌండరీలు, సిక్సర్లు బాదాడు. ఈ మ్యాచ్లో ఇండియా 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన పాకిస్థాన్ నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 273 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన టీమిండియా 45.4 ఓవర్లలో లక్ష్యాన్ని చేధించింది. ఈ మ్యాచ్లో అబ్దుల్ రజాక్ సచిన్ క్యాచ్ని మిస్ చేసిన తర్వాత ఆ జట్టు కెప్టెన్ వసీం అక్రమ్ అన్న మాటలు ఇప్పటికీ ప్రతి అభిమానికి గుర్తుంటాయి. వసీం అక్రమ్ ఏమన్నాడంటే 'ఎవరి క్యాచ్ని వదిలేశావో తెలుసా నీకు' అని.
2004లో సిడ్నీ వేదికగా ఆస్ట్రేలియాపై 241
ఈ ఇన్నింగ్స్తో సచిన్ ఆసీస్ గడ్డపై మరోసారి నిరూపించుకోవాల్సి వచ్చింది. ఈ పర్యటనలో అప్పటివరకు ఆడిన ఐదు ఇన్నింగ్స్లో సచిన్ 85 పరుగులే చేయడంతో సచిన్ పని అయిపోయిందంటూ సర్వాత్రా విమర్శలు వెల్లువెత్తాయి. డ్రాగా ముగిసిన ఈ మ్యాచ్లో సచిన్ మరోసారి తన విశ్వరూపాన్ని ప్రదర్శించాడు. ఈ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన టీమిండియా సచిన్ డబుల్ సెంచరీ చేయడంతో తన తొలి ఇన్నింగ్స్ను 705/7వద్ద డిక్లేర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన ఆస్ట్రేలియా తన తొలి ఇన్నింగ్స్లో 474పరుగులకు ఆలౌటైంది. ఇక, రెండో ఇన్నింగ్స్లో కూడా సచిన్ (60 నాటౌట్), ద్రవిడ్ (91 నాటౌట్) వద్ద ఉన్నప్పుడు 211/2 ఇన్నింగ్స్ డిక్లేర్ చేసింది. రెండో ఇన్నింగ్స్లో ఆస్ట్రేలియా (357/6) డ్రా కోసం ప్రయత్నించడంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.