సచిన్ సరికొత్త ప్రతిపాదన:
వన్డేలను కూడా జనరంజకంగా మార్చేందుకు టీమిండియా దిగ్గజం సచిన్ టెండూల్కర్ ఓ సరికొత్త ప్రతిపాదనతో ముందుకువచ్చాడు. ఒక వన్డే.. 4 ఇన్నింగ్స్లు (25 ఓవర్లకు ఓ ఇన్నింగ్స్).. ఇదే సచిన్ సరికొత్త ప్రతిపాదన. 2009లోనే సచిన్ ఈ ఆలోచన వెల్లడించగా.. ఐసీసీ కూడా చర్చలు జరిపింది. కానీ.. అమలు చేయడానికి మాత్రం ధైర్యం చేయలేదు. అయితే వన్డేలకు కూడా అభిమానుల నుంచి రోజురోజుకూ ఆదరణ తగ్గుతుండడంతో ఇప్పుడు సచిన్ మరోసారి గుర్తుచేశాడు.
ఒక్కో జట్టు.. రెండు ఇన్నింగ్స్:
తాజాగా సచిన్ మాట్లాడుతూ... 'ఇక ఆలస్యం చేయకుండా ఐసీసీ వన్డే ఫార్మాట్పై దృష్టి సారించాలి. నేను గతంలోనే సూచించా. మళ్లీ అదే చెపుతున్నా. ఒక జట్టును 25 ఓవర్లకోసారి 15 నిమిషాల విశ్రాంతితో రెండు ఇన్నింగ్స్ ఆడించాలి. మొత్తం రెండు జట్ల మధ్య నాలుగు ఇన్నింగ్స్ జరుగుతాయి' అని సచిన్ చెప్పాడు. దీనికి ఓ ఉదాహరణ కూడా ఇచ్చాడు.
ఆలౌట్ అయితే వరుసగా రెండు ఇన్నింగ్స్లు:
'జట్టు-ఎ, జట్టు-బి మధ్య వన్డే జరిగితే.. ముందుగా బ్యాటింగ్కు దిగిన జట్టు-ఎ 25 ఓవర్లు ఆడాక 15 నిమిషాల విరామం అనంతరం జట్టు-బి కూడా 25 ఓవర్లు ఆడుతుంది. మళ్లీ జట్టు-ఎ 26వ ఓవర్ నుంచి తిరిగి తమ ఇన్నింగ్స్ను ప్రారంభించి 50 ఓవర్లు పూర్తి చేస్తుంది. అనంతరం ఛేదన దిగిన జట్టు-బి కూడా మిగిలిన 25 ఓవర్లను ఆడుతుంది. ఒకవేళ జట్టు-ఎ తొలి 25 ఓవర్లలోనే వికెట్లన్నీ కోల్పోతే.. విజయం కోసం జట్టు-బి వరుసగా రెండు ఇన్నింగ్స్లు (25+25) ఆడుతుంది' అని సచిన్ వివరించాడు.
మంచు ప్రభావాన్ని అధిగమించొచ్చు:
'25 ఓవర్ల ఇన్నింగ్స్లో తొలి ఐదు ఓవర్లను పవర్ప్లేగా ఆడించాలి. బౌలింగ్ జట్టు తమకు అవసరమైనప్పుడు మూడు ఓవర్లు, బ్యాటింగ్ జట్టు రెండు ఓవర్ల పవర్ప్లే తీసుకోవచ్చు' అని సచిన్ సూచించాడు. 'ఒక జట్టు రెండు ఇన్నింగ్స్లు ఆడడం ద్వారా మంచు ప్రభావాన్ని అధిగమించొచ్చు. దీంతో ప్రతీ జట్టుకు మ్యాచ్లో తిరిగి పుంజుకోవడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ మంచు ప్రభావం ఉనైతే రెగ్యులర్ ఫార్మాట్లో టాస్ గెలిచిన జట్టుకే లాభం ఉంటుంది. కానీ.. దీంట్లో మాత్రం ఇరు జట్లకు అవకాశం ఉంటుంది' అని సచిన్ పేర్కొన్నారు.