కుడి-ఎడమ చేతి బ్యాట్స్మెన్ మేళవింపు ఉంటే:
అయితే ధోనీ బ్యాటింగ్ ఆర్డర్లో ముందు రావాడానికి సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్ల పాత్ర ఉందని తాజాగా తెలిసింది. సచిన్ టైమ్స్ ఆఫ్ ఇండియాతోమాట్లాడుతూ... 'ఫైనల్లో నేను, వీరూ పెవిలియన్ చేరిన అనంతరం గౌతమ్ గంభీర్, విరాట్ కోహ్లీల మధ్య మంచి భాగస్వామ్యం నమోదైంది. లంక కంటే మేము ఓ అడుగు ముందులో ఉండాలనుకున్నాం. ఎడమచేతి వాటం (గౌతమ్) ఔట్ అయితే ఎడమచేతి వాటం (యువీ)ను పంపాలి.. ఇక కుడిచేతి వాటం (కోహ్లీ) ఔట్ అయితే కుడిచేతి వాటం (ధోనీ)ను క్రీజులోకి పంపాలని వీరూతో అన్నాను' అని తెలిపారు.
వీరూకు చెప్పి రమన్నా:
'అప్పటికి గంభీర్ చక్కగా బ్యాటింగ్ చేస్తున్నాడు. అయితే యువీ అద్భుతమైన ఫామ్లో ఉన్నాడు కానీ.. ఇద్దరు నాణ్యమైన ఆఫ్స్పిన్నర్లు బౌలింగ్ చేస్తుండటంతో క్రీజులో గంభీర్కు తోడుగా ధోనీ ఆడితే చక్కగా స్ట్రైక్ రొటేట్ చేస్తాడనిపించింది. నాకున్న సెంటిమెంటు దృష్ట్యా డగౌట్లో నేను ఉన్నచోటి నుంచి కదలకూడదనుకున్నా. అందుకే వీరూకు చెప్పి ఓవర్ విరామ సమయంలో ధోనీ దగ్గరికెళ్లి ఈ విషయం చెప్పి రమ్మన్నా' అని సచిన్ పేర్కొన్నారు.
గ్యారీతో చర్చించాం:
'వీరూ వెళ్లి ధోనీతో విషయం చెప్పాడు. అప్పటికే ధోనీ డ్రెస్సింగ్ రూము వైపు వస్తుండటాన్ని చూశా. ఆపై ధోనీ బయట కూర్చున్న కోచ్ గ్యారీ కిర్స్టన్ దగ్గరకు వెళ్ళాడు. అందరం కలిసి బ్యాటింగ్ ఆర్డర్ గురించి చర్చించాం. గ్యారీ కూడా సరైన నిర్ణయం అని అంగీకరించాడు. ధోనీ కూడా వెళ్తా అనడంతో.. యువీ ఆరో స్థానంలో బ్యాటింగ్ చేసాడు' అని సచిన్ చెప్పుకొచ్చారు. 'వాస్తవానికి నేను ధోనీ వద్దకి వెళ్లి వ్యూహం చెప్దామని వెళ్లబోయేలోపే.. ధోనీనే స్వయంగా డ్రెస్సింగ్ రూము వైపు వస్తుండటాన్ని మేము చూశాం' అని సెహ్వాగ్ కూడా తెలిపాడు.
భారత్ అద్భుత విజయం:
ముంబైలోని వాంఖడే వేదికగా జరిగిన 2011 ఫైనల్ మ్యాచ్లో తొలుత బ్యాటింగ్ చేసిన శ్రీలంక 50 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 274 పరుగులు చేసింది. కెప్టెన్ మహేల జయవర్దనె (103 నాటౌట్: 88 బంతుల్లో 13x4) అజేయ సెంచరీ చేసాడు. లక్ష్యఛేదనకు దిగిన టీమిండియా వీరేంద్ర సెహ్వాగ్ (0), సచిన్ టెండూల్కర్ (18) వికెట్లను ఆదిలోనే కోల్పోయింది. విరాట్ కోహ్లీ (35) కాసేపు నిలబడ్డాడు. గౌతమ్ గంభీర్ (97: 122 బంతుల్లో 9x4)తో కలిసి ధోనీ (91 నాటౌట్: 79 బంతుల్లో 8x4, 2x6) నాలుగో వికెట్కి 109 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పాడు. గంభీర్ ఔటైనా.. యువరాజ్ సింగ్తో కలిసి 48.2 ఓవర్లలోనే 277/4తో మ్యాచ్ని ధోనీ ముగించాడు.