ముంబై : రికార్డుల రారాజు భారత మాజీ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ ఖాతాలో మరో అరుదైన గౌరవ పురస్కారం వచ్చి చేరేది. అది తానే స్వతహాగా నిరాకరించడంతో అది కాస్తా మేరీ కోమ్కు చెందనుంది. పశ్చిమ బెంగాల్కు చెందిన జాదవ్పూర్ యూనివర్సిటీ (జేయూ) సాహిత్యంలో ఇస్తామన్న గౌరవ డాక్టరేట్ను తిరస్కరించాడు. నైతిక కారణాలను చూపుతూ సచిన్ ఈ డాక్టరేట్ను తిరస్కరించినట్లు యూనివర్సిటీ వైస్చాన్స్లర్ సురంజన్ దాస్ వెల్లడించారు.
ఏ యూనివర్సిటీ నుంచి కూడా ఇలాంటి డాక్టరేట్లను తాను స్వీకరించడం లేదని సచిన్ మెయిల్ చేసినట్లు ఆయన చెప్పారు. గతంలోనూ ఇలాగే ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ ఇస్తామన్న గౌరవ డాక్టరేట్ను మాస్టర్ తీసుకోలేదు. అయితే తాను నేర్చుకొని సంపాదించలేని ఇలాంటి డాక్టరేట్లను స్వీకరించడం నైతికంగా సరి కాదన్నదని సచిన్ ఉద్దేశమని సురంజన్ దాస్ చెప్పారు.
Jadavpur University offered @sachin_rt to doctorate but Master Blaster said that it would be morally wrong for him to accept the D. Lit !!
— Sachinist.com (@Sachinist) September 20, 2018
Full Details : https://t.co/NLo9oLvqpT
దీనిపై సురంజన్ దాస్ మాట్లాడుతూ.. 'వార్షిక స్నాతకోత్సవంలో భాగంగా ఆయనకు గౌరవ డాక్టరేట్ను ఇవ్వాలనుకున్నాం. ఆయనకు ఈ మెయిల్ ద్వారా సమాచారం కూడా అందించాం. కానీ, ఆయన మా విన్నపాన్ని సున్నితంగా తిరస్కరించారు. నైతిక కారణాల దృష్ట్యా ఆయన ఈ పురస్కారాన్ని అందుకునేందుకు సుముఖత వ్యక్తం చేయలేదు. చాలా కాలంగా ఆయన ఇలాంటి వాటికి దూరంగా ఉన్నారు. ఇలాంటి అవార్డులు తీసుకోవడం నైతికంగా తప్పు అని సచిన్ అభిప్రాయపడ్డారు' అని తెలిపారు.
టెండూల్కర్ ఇలాంటి పురస్కారాలను తిరస్కరించడం ఇదే తొలిసారి కాదు. 2011లోనూ ఆయన రాజీవ్ గాంధీ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ ఇవ్వాలనుకున్న డాక్టరేట్ను సైతం వద్దన్నారు. సచిన్ నిరాకరించడంతో ఇప్పుడా గౌరవ డాక్టరేట్ను ఇండియన్ ఒలింపిక్ మెడలిస్ట్ బాక్సర్ మేరీకోమ్కు ఇవ్వనున్నట్లు వెస్ట్ బెంగాల్ గవర్నర్ కేసరినాథ్ త్రిపాఠి తెలిపారు. ఒలింపిక్స్ మెడల్తోపాటు ఐదుసార్లు వరల్డ్ అమెచ్యూర్ బాక్సింగ్ చాంపియన్షిప్, 2014 ఏషియన్ గేమ్స్, 2018 కామన్వెల్త్ గేమ్స్లలో గోల్డ్ మెడల్ మేరీకోమ్ సొంతం.