ముంబై: క్రికెట్ దిగ్గజం, భారత బ్యాటింగ్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ ఈరోజు ఆస్పత్రిలో చేరారు. ఇటీవల కరోనా బారిన పడిన సచిన్.. వైద్యుల సూచన మేరకు కొద్ది రోజులు ఆస్పత్రిలో చికిత్స పొందనున్నారు. మాస్టర్ బ్లాస్టర్ సచిన్ ఈ విషయాన్ని తన ట్విట్టర్లో స్వయంగా వెల్లడించారు. తాను కోలుకోవాలని ప్రార్థనలు చేసిన వారికి థ్యాంక్స్ చెప్పారు. సచిన్ ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ 2021లో పాల్గొన్న విషయం తెలిసిందే. ఆ సిరీస్లో పాల్గొన్న నలుగురు భారత ఆటగాళ్లకు పాజిటివ్గా తేలింది.
'నేను త్వరగా కోలుకోవాలని అభిమానులు చేస్తున్న ప్రార్థనలకు, వారు చూపిస్తున్న ప్రేమా ఆప్యాయతలకు ధన్యవాదాలు. వైద్యుల సలహా మేరకు తగిన జాగ్రత్తలు తీసుకుంటూ ఆస్పత్రిలో చేరాను. కొద్ది రోజుల్లో సంపూర్ణ ఆరోగ్యంతో ఇంటికి తిరిగి వస్తా. కరోనా వైరస్ మళ్లీ పంజా విసురుతున్న నేపథ్యంలో ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా ఉండాలని కోరుతున్నా' అని మాస్టర్ బ్లాస్టర్ సచిన్ టెండూల్కర్ ట్వీట్ చేశారు. ఇక 2011లో భారత్ రెండోసారి వన్డే ప్రపంచకప్ గెలిచి నేటికి పదేళ్లు పూర్తి అయిన నేపథ్యంలో సచిన్.. దేశ ప్రజలకు, తన సహచరులకు శుభాకాంక్షలు చెప్పారు.
Thank you for your wishes and prayers. As a matter of abundant precaution under medical advice, I have been hospitalised. I hope to be back home in a few days. Take care and stay safe everyone.
— Sachin Tendulkar (@sachin_rt) April 2, 2021
Wishing all Indians & my teammates on the 10th anniversary of our World Cup 🇮🇳 win.
మార్చి 27న తాను కరోనా బారిన పడినట్లు సచిన్ టెండూల్కర్ స్వయంగా ట్వీట్ చేసిన సంగతి తెలిసిందే. తేలిక పాటి లక్షణాలు కనిపించడంతో కరోనా టెస్టు చేయించుకున్నానని.. దాంతో పాజిటివ్గా తేలిందని చెప్పారు. తన కుటుంబ సభ్యులకు నెగెటివ్ వచ్చిందన్నారు. ఈ క్రమంలోనే వైద్యుల సూచన మేరకు తొలుత హోమ్ క్వారంటైన్లో ఉన్న సచిన్.. ఇప్పుడు ఆస్పత్రిలో చేరారు. రాయ్పూర్లో జరిగిన రోడ్ సేఫ్టీ సిరీస్లో ఇండియా లెజెండ్స్ను కెప్టెన్గా సచిన్ వ్యవహరించారు. అదే టోర్నీలో ఆడిన యూసుఫ్ పఠాన్, ఇర్ఫాన్ పఠాన్, ఎస్ బద్రీనాథ్ సైతం వైరస్ బారిన పడ్డారు. వారందారూ ఇప్పుడు హోమ్ క్వారంటైన్లో ఉంటూ చికిత్స పొందుతున్నారు.
1989 నుంచి 24 ఏళ్ల పాటు క్రికెట్ ఆడిన సచిన్ టెండూల్కర్.. అంతర్జాతీయ క్రికెట్లో 100 శతకాలు నమోదు చేసిన ఏకైక బ్యాట్స్మెన్గా రికార్డ్ నెలకొల్పారు. అంతర్జాతీయ క్రికెట్లో ఇప్పటివరకు ఎవరికీ సాధ్యంకానన్ని పరుగులతో సచిన్ అగ్రస్థానంలో నిలిచారు. లిటిల్ మాస్టర్ తన కెరీర్ మొత్తంలో 34,357 పరుగులు బాదాడు. టెస్టుల్లో 15921, వన్డేల్లో 18426, టీ20ల్లో 10 రన్స్ చేశారు. వన్డేల్లో తొలి ద్విశతకం బాదిన క్రికెటర్గా సచిన్ చరిత్ర సృష్టించిన విషయం తెలిసిందే.