సచిన్ మద్దతు:
కరోనాపై పోరాటంలో భాగంగా ఆదివారం రాత్రి 9 గంటలకు దేశంలో ప్రతి పౌరుడు దీపాలు వెలిగించాలన్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పిలుపు మేరకు క్రీడాకారులు దీపాలతో మద్దతు తెలిపారు. ఇండ్లలోని విద్యుత్ దీపాలను ఆపేసి ప్రమిదలు, కొవ్వొత్తులు, టార్చిలైట్లు, మొబైల్ ఫ్లాష్లైట్లతో తమ సంఘీభావాన్ని తెలిపారు. ప్రధాని పిలుపునందుకుని తన కుటుంబంతో సహా కొవ్వత్తులను వెలిగించిన క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్.. సోషల్ మీడియాలో ఒక పోస్టును షేర్ చేశాడు. మన పరిసరాలను శుభ్రం చేస్తూ, ఆస్పత్రులను, వైరస్ ప్రభావిత ప్రాంతాలను శుభ్రపరుస్తున్న శానిటేషన్ సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపాడు.
కలిసి కట్టుగా ఉండాలి:
టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ, తన సతీమణి అనుష్క శర్మతో కలిసి దీపాలను వెలిగిస్తున్న ఫొటోలను ట్విట్టర్ ఖాతాలో షేర్ చేసి ఒక కామెంట్ను పెట్టాడు. మనమంతా కలిసి ఉమ్మడిగా ప్రార్థన చేస్తే.. కచ్చితమైన విభిన్నమైన ఫలితాలు వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశాడు. అలాగే ప్రతి ఒక్కరి కోసం ప్రార్థన చేయాలని, అందరం కలిసి కట్టుగా ఉండాలని ఒక ఎమోజీని కోహ్లీ పోస్టు చేశాడు.
రోహిత్, రైనా, మిథాలీ..:
రోహిత్ శర్మ, హార్దిక్ పాండ్యా, లోకేశ్ రాహుల్, సురేశ్ రైనా, హర్భజన్ సింగ్, మాజీ ఆల్రౌండర్ యువరాజ్ సింగ్, విధ్వంసక వీరుడు వీరేంద్ర సెహ్వాగ్, పార్థీవ్ పటేల్, టీమిండియా హెడ్కోచ్ రవిశాస్త్రితో పాటు మహిళా క్రికెటర్ మిథాలీ రాజ్.. బ్యాడ్మింటన్ స్టార్లు పీవీ సింధు, సైనా నెహ్వాల్, అశ్విని పొన్నప్ప.. టెన్నిస్ స్టార్ మహేశ్ భూపతిలు తమ కుటుంబ సభ్యులతో ప్రమిదలు, కొవ్వొత్తులు వెలిగించారు.
దేశం మొత్తం ఒక్కటేనని నిరూపించారు:
మోదీ పిలుపు మేరకు.. ఆరుసార్లు ప్రపంచ చాంపియన్ మేరేకోమ్.. భారత వేగవంతమైన మహిళ దుత్యీచంద్.. స్టార్ రెజ్లర్లు బజరంగ్ పునియా, సాక్షి మాలిక్, యోగేశ్వర్ దత్.. టీటీ ప్లేయర్ మనికా బాత్రా.. బాక్సర్ అమిత్ పంగల్, పూజా దండా, జోష్నా చినప్ప తదితరులు పాల్గొన్నారు. ఆదివారం రాత్రి 9 గంటలకు కొవ్వొత్తులు, ప్రమిదలు వెలిగించి భారత దేశం మొత్తం ఒక్కటేనని నిరూపించారు.