కోచ్గా రాహుల్ ద్రవిడ్ హనీమూన్ ముగిసింది.. ఇక కష్టపడాల్సిందే: మాజీ సెలెక్టర్

న్యూఢిల్లీ: ఆసియాకప్ 2022లో టీమిండియా ఘోర వైఫల్యం నేపథ్యంలో జట్టు కోచ్ రాహుల్ ద్రవిడ్, కెప్టెన్ రోహిత్ శర్మలపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అనవసర ప్రయోగాలతో జట్టుకు తీరని నష్టం చేస్తున్నారని మాజీ క్రికెటర్లు మండిపడుతున్నారు. ఇక నుంచైనా అనవసర ప్రయోగాలను ఆపేసి అసలు సిసలు జట్టును తయారు చేయాలని సూచిస్తున్నారు. ఇక టైటిల్ ఫేవరెట్గా ఆసియా కప్ బరిలోకి దిగిన టీమిండియా.. పేలవ ప్రదర్శనతో ఇంటి దారి పట్టిన విషయం తెలిసిందే.

ఈ ఓటమి మేల్కోలుపు...
సూపర్ 4 దశలో పాక్, శ్రీలంకపై ఓడి భారత అభిమానుల ఆశలను గల్లంతు చేస్తూ టైటిల్ రేసు నుంచి నిష్క్రమించింది. అయితే, అప్కమింగ్ టీ20 ప్రపంచ కప్ ముందు భారత జట్టుకు ఈ ఓటమి మేల్కొలుపు లాంటిదని దిగ్గజ క్రికెటర్లు అభిప్రాయపడుతున్నారు. ఈ క్రమంలోనే బీసీసీఐ మాజీ సెలెక్టర్ సబా కరీమ్ రాహుల్ ద్రవిడ్ను ఉద్దేశించి కీలక వ్యాఖ్యలు చేశాడు. కోచ్గా అతడి హనీమూన్ కాలం ముగిసిందని, ఇక జట్టుపై గట్టిగా దృష్టిపెట్టాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. ద్రవిడ్ పనితీరుపై సబా కరీం స్పోర్ట్స్ 18 చానెల్తో మాట్లాడాడు.

ద్రవిడ్ హనీమూన్ ముగిసింది..
'2021లో టీమ్ఇండియా హెడ్కోచ్గా బాధ్యతలు స్వీకరించిన తర్వాత ద్రవిడ్పై ఎన్నో అంచనాలు నెలకొన్నాయి. కోచ్గా హనీమూన్ కాలం ముగిసిందని ద్రవిడ్కూ తెలుసు. అతను తన ఉత్తమ ప్రదర్శనను అందించేందుకు సాయశక్తులా ప్రయత్నిస్తున్నాడు. అయితే.. జట్టులో ఆ ఫలితం మాత్రం కనిపించడం లేదు. ఇది అతనికి కఠిన సమయం. అతని కోచింగ్లో టీమిండియా సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్, ఇంగ్లండ్తో చివరి టెస్టులో విజయం సాధించాల్సింది. కానీ అలా జరగలేదు.

అసలు చాలెంజ్ ఇప్పుడే..
అయితే ఇప్పుడు అతని ముందు అసలైన సవాళ్లున్నాయి. త్వరలో టీ20 ప్రపంచకప్ రాబోతోంది. వచ్చే ఏడాది వన్డే వరల్డ్ కప్ కూడా ఉంది. ఈ రెండు పెద్ద ఐసీసీ ఈవెంట్లను భారత్ గెలుచుకోగలిగితే.. కోచ్గా అందించిన సేవలతో ద్రవిడ్ సంతృప్తి చెందుతాడు' అని కరీం పేర్కొన్నారు. ఐసీసీ ఈవెంట్లలో భారత్ నంబర్ 1గా నిలిచి, సేనా దేశాలలో టెస్టు సిరీస్లను గెలవడం ద్వారా కోచ్గా తన పదవీకాలం విజయవంతమవుతుందనే విషయాన్ని రాహుల్ అర్థం చేసుకోగలడని కరీం వివరించారు.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications