న్యూఢిల్లీ: భారత మాజీ వికెట్ కీపర్, బీసీసీఐ క్రికెట్ వ్యవహారాల జనరల్ మేనేజర్ సబా కరీం తన పదవికి రాజీనామా చేశారు. అయితే ఈ విషయంపై బీసీసీఐ నుంచి ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. కరీం తన రాజీనామా లేఖను బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీ, కార్యదర్శి జై షాకు ఆదివారం పంపారు. కరీం సిద్ధం చేసిన దేశవాళీ క్రికెట్ ప్రణాళికల పట్ల సంతృప్తి చెందకపోవడం వల్లే అతణ్ని తప్పించాలని బోర్డు నిర్ణయించుకున్నట్లు సమాచారం తెలిసింది.
2017 డిసెంబరులో సబా కరీం బీసీసీఐ క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్గా నియమితుడయ్యారు. అయితే కరోనా వైరస్ మహమ్మారి వ్యాప్తి నేపథ్యంలో దేశవాళీ క్రికెట్కు స్పష్టమైన కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేయకపోవడంతో బోర్డు అసంతృప్తితో ఉందని, అందుకే అతణ్ణి రాజీనామా కోరినట్టు బీసీసీఐ వర్గాలు తెలిపాయి. ఈ నేపథ్యంలో ఆదివారం కరీం తన పదవికి రాజీనామా చేశారు. 52 ఏళ్ల కరీం భారత్ తరఫున 34 వన్డేలు, ఒక టెస్టు ఆడారు.
'సబా కరీంను రాజీనామా చేయాలని అడిగిన మాట వాస్తవమే. కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో దేశవాళీ క్రికెట్కు సంబంధించిన ప్రణాళికను అతను సరిగా సిద్ధం చేయలేకపోవడం రాజీనామా చేయమని చెప్పడం వెనుక కారణాల్లో ఒకటి' అని బీసీసీఐ వర్గాలు పీటీఐకి ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో తెలిపాయి. ఇక క్రికెట్ ఆపరేషన్స్ చీఫ్గా కొత్తవారిని బోర్డు త్వరలోనే నియమించనుంది. అపెక్స్ కౌన్సిల్ ఈ పదవిని భర్తీ చేయడానికి ఆఫీసు బేరర్లకు పూర్తి అధికారాలను ఇచ్చింది.
తాజాగా బీసీసీఐ ముఖ్య కార్య నిర్వాహణాధికారి రాహుల్ జోహ్రి రాజీనామాను కూడా బోర్డు ఆమోదించిన సంగతి తెలిసిందే. 2016లో బీసీసీఐ ముఖ్య కార్యనిర్వాహక అధికారిగా జోహ్రి బాధ్యతలు చేపట్టారు. సుప్రీంకోర్టు నియమించిన బోర్డు పాలకుల కమిటీ సౌరవ్ గంగూలీ నేతృత్వంలోని బోర్డుకు పూర్తి అధికారాలు అప్పగించిన వెంటనే.. జోహ్రి తన పదవికి రాజీనామా చేశారు. ఆ రాజీనామాను ఆమోదించని బోర్డు.. 2021లో ఒప్పందం ముగిసేవరకు బాధ్యతల్లో కొనసాగాలని జోహ్రిని కోరింది. నిరుడు డిసెంబరు 27న మరోసారి అతడు రాజీనామా చేశారు. చాలాకాలం పెండింగ్లో ఉన్న అతడి రాజీనామాను తాజాగా బోర్డు ఆమోదించింది.
రసపట్టులో రెండో టెస్టు.. విజృంభించిన బ్రాడ్, వోక్స్.. పోరాడిన బ్రాత్వైట్, బ్రూక్స్