బెంగళూరు: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) స్పాట్ ఫిక్సింగ్ నిషేధం తర్వాత తిరిగి క్రికెట్లో అడుగుపెట్టిన టీమిండియా వెటరన్ పేసర్ ఎస్ శ్రీశాంత్.. 15 ఏళ్ల తర్వాత ఒక మ్యాచ్లో ఐదు వికెట్లు పడగొట్టాడు. విజయ్ హజారే ట్రోఫీలో భాగంగా సోమవారం బెంగళూరులోని కెఎస్సిఎ స్టేడియంలో ఉత్తరప్రదేశ్, కేరళ మధ్య మ్యాచ్లో శ్రీశాంత్ ఈ ఘనత సాధించాడు. 9.3 ఓవర్లు వేసిన అతడు 65 పరుగులు ఇచ్చి 5 వికెట్లు తీసుకున్నాడు. చివరిసారి 2006లో ఓ లిస్ట్ ఎ ఫార్మాట్ మ్యాచ్లో శ్రీశాంత్ ఐదు వికెట్లు తీశాడు.
అభిషేక్ గోస్వామి (54; 63 బంతుల్లో 4x4, 2x6), అక్షదీప్ నాథ్ (68; 60 బంతుల్లో 9x4), భువనేశ్వర్ కుమార్ (1), మొహ్సిన్ ఖాన్ (6), శివం శర్మ (7)ల వికెట్లను ఎస్ శ్రీశాంత్ పడగొట్టాడు. ఈ మ్యాచ్కు ముందు శ్రీశాంత్ 87 లిస్ట్ ఎ మ్యాచ్ల్లో 113 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 6/55 ఉత్తమ గణాంకాలు. శ్రీశాంత్ చెలరేగడంతో యూపీ 283 పరుగులకు ఆలౌటైంది. కేరళ 25 ఓవర్లలో మూడు వికెట్ల నష్టానికి 163 పరుగులు చేసింది. ఇక టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లో శ్రీశాంత్ రెండు వికెట్లు తీసుకున్నాడు.
ఐపీఎల్ 2021లో ఆడాలని శ్రీశాంత్ ఆశపడినా.. అతనిపై ఫ్రాంచైజీలు ఆసక్తి చూపకపోవడంతో కనీసం వేలానికి కూడా అర్హత సాధించలేకపోయిన విషయం తెలిసిందే. ఈ ఏడాది మినీ వేలం కోసం మొత్తంగా 1114 మంది ఆటగాళ్లు పేరు నమోదు చేసుకోగా.. ఫ్రాంచైజీ యాజమాన్యాల సూచనల ప్రకారం 292 మందిని షార్ట్ లిస్ట్ చేశారు. స్పాట్ ఫిక్సింగ్ ఆరోపణలతో దాదాపు 7-8 ఏళ్లుగా క్రికెట్కు దూరమైన శ్రీశాంత్కు నిరాశే ఎదురైంది. రూ.75 లక్షల కనీస ధరతో వేలంలోకి వచ్చాడు. ఈ నెల 18న చెన్నైలో వేలం ముగిసిన విషయం తెలిసిందే.
బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో తన పేరు లేకపోవడంపై శ్రీశాంత్ స్పందించాడు. ఇన్స్టాగ్రామ్లో ఓ వీడియో పోస్ట్ చేసిన శ్రీశాంత్ కాస్త భావోద్వేగం చెందాడు. 'ఐపీఎల్ 2021 కోసం బీసీసీఐ ప్రకటించిన తుది జాబితాలో నా పేరు లేకపోవడం బాధగా ఉన్నా.. దాని గురించి ఎక్కువగా ఆలోచించకుండా మరింత సానుకూలంగా ముందుకు సాగుతా. నాపై ప్రేమను చూపించిన అభిమానులకు కృతజ్ఞతలు. నాకింకా 38 ఏళ్లే. క్రికెట్ను అంత తేలిగ్గా వదలను. మరింత ఎక్కువగా కష్టపడి వచ్చే ఏడాది ఐపీఎల్ ఆడేందుకు ప్రయత్నిస్తా' అని శ్రీశాంత్ అన్నాడు.
శ్రీశాంత్ 2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ.. స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలాడు. దీంతో బీసీసీఐ ఎలాంటి క్రికెట్ ఆడకుండా అతనిపై జీవితకాల నిషేధం విధించింది. 2019లో సుప్రీంకోర్టు అతడి నిషేధ కాలాన్ని తగ్గించాలని బీసీసీఐని ఆదేశించడంతో ఏడేళ్లకు కుదించింది. గతేడాది సెప్టెంబర్తో ఈ నిషేధం పూర్తయింది. అనంతరం దేశవాళి క్రికెట్లో కేరళ జట్టు తరఫున ఆడుతున్నాడు. ఇటీవల సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో పాల్గొని ఫర్వాలేదనిపించాడు. ఇప్పడు విజయ్ హజారే ట్రోఫీలో ఆడుతున్నాడు.
India vs England: ఆ ఒక్క ఇన్నింగ్సే అతడి కెరీర్ను మార్చేసింది.. ఏకంగా టీమిండియాలో చోటు!!