కెప్టెన్గా రోహిత్
భారత వివాదాస్పద ఫాస్ట్ బౌలర్ శ్రీశాంత్ తాజాగా తన డ్రీమ్ ఎలెవన్ భారత టీ20 జట్టుని ప్రకటించాడు. అయితే తన జట్టులో తనకు స్థానం కల్పించుకున్నాడు. ఇక కెప్టెన్ విషయంలోనూ పెద్ద ట్విస్ట్ ఇచ్చాడు. కెప్టెన్సీ అవకాశం తన ఫేవరేట్ సారథి ఎంఎస్ ధోనీ లేదా ప్రస్తుత కెప్టెన్ విరాట్ కోహ్లీకి ఇవ్వలేదు. ప్రస్తుతం భారత్ వన్డే, టీ20 జట్టుకి వైస్ కెప్టెన్గా ఉన్న రోహిత్ శర్మకి కెప్టెన్సీని కట్టబెట్టాడు. ఐపీఎల్లో ముంబై ఇండియన్స్ కెప్టెన్గా ఉన్న రోహిత్.. ఏకంగా నాలుగు సార్లు ఆ జట్టుని విజేతగా నిలిపాడు. 12 ఏళ్ల ఐపీఎల్ చరిత్రలో ఏ జట్టు కూడా ఇన్నిసార్లు టైటిల్ గెలవలేదు. దాంతో రోహిత్ కెప్టెన్సీపై శ్రీశాంత్ నమ్మకం ఉంచాడు.
రైనాపై నమ్మకం
శ్రీశాంత్ తన డ్రీమ్ ఎలెవన్ భారత టీ20 జట్టు ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ని ఎంచుకున్నాడు.మూడో స్థానానికి విరాట్ కోహ్లీని ఎంపిక చేశాడు. నెం.4లో వెటరన్ ఆటగాడు సురేశ్ రైనాని ఎంపిక చేయడమే అందర్నీ ఆశ్చర్యపరుస్తోంది. గత రెండేళ్లుగా భారత్ జట్టుకి దూరంగా ఉంటున్న రైనా.. కేవలం ఐపీఎల్లో మాత్రమే ఆడుతున్నాడు. అయినా కూడా ఈ టీ20 స్పెషలిస్ట్ బ్యాట్స్మెన్పై శ్రీశాంత్ నమ్మకం ఉంచాడు.
బుమ్రాతో కలిసి తనకు అవకాశం
గత కొన్ని నెలలుగా అద్భుతమైన ఫామ్లో ఉన్న లోకేష్ రాహుల్ను 5 వ స్థానంలో తీసుకున్నాడు శ్రీశాంత్. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని 6 వ స్థానంలో ఎంచుకున్నాడు. ఆ తర్వాత ఆల్రౌండర్లుగా హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజాలను తీసుకున్నాడు. ఇక స్పిన్ బౌలింగ్ కోసం కుల్దీప్ యాదవ్ ఒక్కడినే తీసుకున్నాడు. చివరగా ఫాస్ట్ బౌలర్ల విషయానికొస్తే.. జస్ప్రీత్ బుమ్రాతో కలిసి తనను తాను ఎంచుకున్నాడు శ్రీశాంత్. శ్రీశాంత్ భారత్ తరఫున 27 టెస్టులు, 53 వన్డేలు, 10 టీ20 మ్యాచ్లాడి.. మొత్తం 169 వికెట్లు పడగొట్టాడు.
శ్రీశాంత్ టీ20 జట్టు
రోహిత్ శర్మ (కెప్టెన్), శిఖర్ ధావన్, విరాట్ కోహ్లీ, సురేశ్ రైనా, కేఎల్ రాహుల్, ఎంఎస్ ధోనీ, హార్దిక్ పాండ్య, రవీంద్ర జడేజా, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, శ్రీశాంత్.
సెప్టెంబరుతో శిక్షా కాలం పూర్తి
2013 ఐపీఎల్లో రాజస్తాన్ రాయల్స్ జట్టు తరఫున ఆడుతూ స్పాట్ ఫిక్సింగ్ ఉదంతంలో దోషిగా తేలడంతో బీసీసీఐ ఏ స్థాయిలోనూ క్రికెట్ ఆడకుండా అతనిపై జీవిత కాల నిషేధం విధించింది. శ్రీశాంత్ దీనిని సవాల్ చేస్తూ కోర్టులో పోరాడాడు. హైకోర్టు కూడా అతనిపై నిషేధాన్ని సమర్థించింది. అయితే సుప్రీం కోర్టులో మాత్రం ఈ కేరళ పేసర్కు ఊరట లభించింది. శ్రీశాంత్ను దోషిగానే గుర్తించిన సుప్రీం.. జీవిత కాల శిక్షను మాత్రమే తగ్గించమంటూ బీసీసీఐకి సూచించింది. దాంతో అతని శిక్షను ఏడేళ్లకు తగ్గిస్తూ బోర్డు అంబుడ్స్మన్ డీకే జైన్ నిర్ణయం తీసుకున్నారు. దీని ప్రకారం ఈ ఏడాది సెప్టెంబరుతో అతని శిక్షా కాలం పూర్తి కానుంది.