
రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో భాగంగా కాన్పూర్లోని గ్రీన్ పార్క్లో జరిగిన మ్యాచ్లో ఇంగ్లాండ్ లెజెండ్స్ను 7వికెట్ల తేడాతో శ్రీలంక లెజెండ్స్ ఓడించింది. తద్వారా 8జట్ల పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరుకుంది. శ్రీలంక తొలుత బౌలింగ్లో ఇంగ్లాండ్ను 78 పరుగులకే ఆలౌట్ చేసింది. ఆ తర్వాత లక్ష్యాన్ని సునాయసంగా ఛేదించింది. మాజీ ఓపెనర్ తిలకరత్నే దిల్షాన్ నేతృత్వంలోని శ్రీలంక లెజెండ్స్కు ఇది వరుసగా రెండో విజయం కావడం విశేషం. సెప్టెంబరు 11న తమ కెప్టెన్ చేసిన అద్భుతమైన సెంచరీతో రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్ ఓపెనర్లో ఆస్ట్రేలియా లెజెండ్స్ను శ్రీలంక ఓడించిన సంగతి తెలిసిందే.
ఈ మ్యాచ్లో మంగళవారం లెజెండరీ ప్లేయర్ సనత్ జయసూర్య తన మిస్టరీ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్తో చెలరేగిపోయాడు. తన స్పిన్ మాయాజాలాన్ని మరోసారి చూపించి అభిమానులను అలరించాడు. జయసూర్య 4ఓవర్లు బౌలింగ్ చేసి కేవలం 3పరుగులు మాత్రమే ఇచ్చి 4వికెట్లు తీశాడు. అతను 2మెయిడిన్ ఓవర్లు కూడా వేశాడు. ఒక మెయిడిన్ ఓవర్లో 2వికెట్లు తీశాడు. జయసూర్య దెబ్బకు ఇంగ్లాండ్ మిడిల్ ఆర్డర్ కుప్పకూలింది. కెప్టెన్ ఇయాన్ బెల్ 24 బంతుల్లో కేవలం 15పరుగులు టాప్ స్కోరర్గా నిలిచాడు. మరో బౌలర్ చతురంగ డిసిల్వా 2వికెట్లతో మెరిశాడు. పేసర్ నువాన్ కులశేఖర కూడా 2 వికెట్లు తీశాడు. దీంతో ఇంగ్లాండ్ తమ ఇన్నింగ్స్లో మళ్లీ ఊపందుకోలేకపోయింది. ఛేజింగ్లో తిలకరత్నే దిల్షాన్ 21బంతుల్లో 15పరుగులు చేసి ఔటయ్యాడు. అయితే ఉపుల్ తరంగ (15), దిల్షాన్ మునవీర (24) రాణించడంతో పాటు చివర్లో జీవన్ మెండిస్ (8పరుగులు) సిక్స్ కొట్టడంతో విజయ లాంఛనం ముగిసింది. శ్రీలంక మరో 3.3 ఓవర్లు మిగిలి ఉండగానే విజయం సాధించింది. శ్రీలంక ప్రస్తుతం 2 మ్యాచ్లలో 4పాయింట్లతో.. ఇండియా లెజెండ్స్ కంటే 2పాయింట్లతో ఆధిక్యంలో ఉంది. సచిన్ టెండూల్కర్ నేతృత్వంలోని జట్టు రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో తమ తొలి మ్యాచ్లో ద
క్షిణాఫ్రికా లెజెండ్స్ను ఓడించింది. నేడు వెస్టిండీస్ లెజెండ్స్తో భారత్ తలపడనుంది.