|
విశ్రాంతి లేదు
వచ్చే వారంతంలో ప్రారంభమయ్యే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 14వ సీజన్ కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు సారథి విరాట్ కోహ్లీ చెమటోడుస్తున్నాడు. ట్రేడ్మిల్పై పరుగులు తీస్తున్న వీడియోను అభిమానులతో పంచుకొని సంతోషం వ్యక్తం చేశాడు. తాను విశ్రాంతి తీసుకోనని, ఇకపై ఐపీఎల్ కోసం పరుగెత్తాలని పేర్కొంటూ కోహ్లీ ట్వీట్ చేశాడు. కోహ్లీ పోస్టు చేసిన వీడియోకు తన సహచర ఆటగాడు ఏబీ డివిలియర్స్ స్పందించాడు. తాను కూడా ఐపీఎల్ కోసం సిద్ధమయ్యానని లగేజ్ సర్దుకున్న ఫొటోను రీట్వీట్ చేశాడు. 'కోహ్లీ ఫామ్లో ఉండటం ఇష్టపడుతున్నా. ఆర్సీబీ జట్టుతో కలిసేందుకు సిద్ధంగా ఉన్నా' అని కాప్షన్ జతచేశాడు.
ఈసారైనా టైటిల్ గెలుస్తుందో
ఇప్పటివరకు రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు టైటిల్ సాధించని సంగతి తెలిసిందే. గతేడాది ప్లేఆఫ్స్కు చేరినా.. కోహ్లీసేన అక్కడి నుంచే నిష్క్రమించింది. ఈసారైనా ఆర్సీబీ టైటిల్ గెలుస్తుందో లేదో చూడాలి. ఏప్రిల్ 9 నుంచి మే 30 వరకూ ఐపీఎల్ 2021 మ్యాచ్లు జరగనున్న విషయం తెలిసిందే. ముంబై, కోల్కతా, ఢిల్లీ, చెన్నై, బెంగళూరు, అహ్మదాబాద్ మ్యాచ్లకి ఆతిథ్యం ఇవ్వబోతున్నాయి. టోర్నీ మొదటి మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరగనుంది. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో ఏప్రిల్ 9న ముంబై ఇండియన్స్ ఢీ కొట్టబోతోంది.
బయో బబుల్లో కష్టమే
సుదీర్ఘకాలం బయో బబుల్లో ఉండడం వల్ల క్రికెటర్లు ఉక్కిరిబిక్కిరి అవుతారని విరాట్ కోహ్లీ అన్నాడు. ఇంగ్లండ్తో సిరీస్లో బయో బబుల్ ఉన్న క్రికెటర్లు నేరుగా ఐపీఎల్ బయో బబుల్లోకి వెళ్తున్న నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. 'భవిష్యత్తులో షెడ్యూలింగ్ విషయంలో జాగ్రత్త పడాలి. ఎందుకంటే రెండు మూడు నెలల పాటు బయో బబుల్లో ఉండడం ఆటగాళ్లకు చాలా కష్టంగా అనిపిస్తుంది. అందరి మానసిక దృఢత్వం ఒకేలా ఉండదు. కొందరికి ఉడికిపోతున్న భావన కలగొచ్చు. మార్పు కావాలి అని వారికి అనిపించవచ్చు. భవిష్యత్తులు పరిస్థితులు మారతాయని ఆశిస్తున్నా' అని కోహ్లీ అన్నాడు.