ముంబై: టీమిండియా మహిళా టీ20 కెప్టెన్ హర్మన్ప్రీత్ కౌర్కు కరోనా సోకింది. హర్మన్ప్రీత్కు సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిందని, ఆమెకు కరోనా లక్షణాలు స్వల్పంగా ఉన్నాయని ఓ జాతీయ మీడియా తెలిపింది. వైద్యుల సలహా మేరకు హర్మన్ప్రీత్ ప్రస్తుతం పాటియాలాలోని తన నివాసంలో ఐసోలేషన్లో ఉన్నారు. గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం రావడంతో టీమిండియా మహిళా టీ20 కెప్టెన్ కౌర్ సోమవారం సాయంత్రం కరోనా టెస్టులు చేయించుకున్నారు.
లక్నోలో దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్లో భాగంగా మార్చి 17న జరిగిన చివరి వన్డేలో హర్మన్ప్రీత్ కౌర్ ఆడారు. ఆ మ్యాచులో 55 బంతుల్లో 30 పరుగులు చేశారు. గాయం కారణంగా మ్యాచ్ మధ్యలోనే తప్పుకున్నారు. అనంతరం జరిగిన టీ20 సిరీస్లో హర్మన్ప్రీత్ ఆడలేదు. పాటియాలాలోని తన నివాసంలో ఉంటున్న ఆమెకు గత నాలుగు రోజుల నుంచి స్వల్పంగా జ్వరం వచ్చింది. దీంతో కౌర్ సోమవారం కరోనా పరీక్ష చేయించుకోగా.. ఆమెకు మంగళవారం కరోనా పాజిటివ్ అని వెల్లడైంది.
కరోనా పాజిటివ్ రావడంతో హర్మన్ప్రీత్ కౌర్ సెల్ఫ్ ఐసోలేషన్లో ఉన్నారని ఆమె తోటి క్రీడాకారిణి కూడా తెలిపారు. తేలికపాటి జ్వరంతో బాధపడుతున్న కౌర్.. త్వరగా కరోనా నుంచి కోలుకోవాలని మహిళా జట్టు సభ్యులు కోరారు. భారత్ తరఫున 100 వన్డేలకు ప్రాతినిధ్యం వహించిన ఐదో భారత మహిళా క్రికెటర్గా కౌర్ నిలిచిన విషయం తెలిసిందే. లక్నో వేదికగా జరిగిన తొలి వన్డేలో ఈ మైలురాయి అందుకున్నారు. కౌర్ భారత్ తరఫున 2 టెస్టులు, 104 వన్డేలు, 114 టీ20లు ఆడారు. మొత్తంగా 4 సెంచరీలు, 18 అర్ధ సెంచరీలు చేశారు.
భారత మాజీ క్రికెటర్ ఇర్ఫాన్ పఠాన్కు కూడా సోమవారం కరోనా పాజిటివ్గా నిర్ధారణ అయిన విషయం తెలిసిందే. ఇర్ఫాన్ కంటే ముందు సచిన్ టెండూల్కర్, ఎస్ బద్రీనాథ్, యూసుఫ్ పఠాన్ కూడా కరోనా బారిన పడ్డారు. ఇటీవల ముగిసిన రోడ్ సేఫ్టీ వరల్డ్ సిరీస్లో వీరందరూ పాల్గొన్న విషయం తెలిసిందే. అందరూ డ్రెస్సింగ్ రూమ్ను పంచుకోవడంతో వీరేంద్ర సెహ్వాగ్, యువరాజ్ సింగ్, మొహ్మద్ కైఫ్, మునాఫ్ పటేల్, ప్రజ్ఞాన్ ఓజా, నమన్ ఓజా, ఆర్ వినయ్ కుమార్లలో ఆందోళన మొదలైంది.
IPL 2021: బీఎండబ్ల్యూ కారులో దర్జాగా వచ్చి.. జట్టుతో చేరిన రోహిత్ శర్మ!! (వీడియో)