ట్రిపుల్ డబుల్ సెంచరీ ..
2017 శ్రీలంక భారత పర్యటన సందర్భంగా డిసెంబర్ 13న పంజాబ్ మొహాలి స్టేడియంలో ఎవరూ ఊహించని విధంగా రోహిత్ డబుల్ సెంచరీతో చెలరేగాడు. శిఖర్ ధావన్(67 బంతుల్లో 9ఫోర్లతో 68)తో కలిసి ఇన్నింగ్స్ ప్రారంభించిన రోహిత్ శర్మ (153 బంతుల్లో 13 ఫోర్లు, 12 సిక్సర్లతో 208 ) వీరవిహారం చేశాడు. ఈ ఇద్దరూ తొలి వికెట్కు 115 పరుగులు జోడించారు. ధావన్ ఔటయ్యాక శ్రేయస్ అయ్యర్(70 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్స్లతో 88 )తో మరో అమూల్యమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. దాంతో భారత్ 392/4 భారీ స్కోర్ చేసింది. ఇక లంక చేజింగ్లో తడబడి 251/8 పరుగులకే పరిమితమైంది. ఈ మ్యాచ్ జరిగి నేటికి సరిగ్గా నాలుగేళ్లు పూర్తవ్వడంతో అభిమానులు మరోక డబుల్ కావాలి కెప్టెన్ హిట్ మ్యాన్ అంటూ కామెంట్ చేస్తున్నారు.
ఏడేళ్ల క్రితం తొలిసారి..
ఏడేళ్ల క్రితం 2013లో రోహిత్ తొలి డబుల్ సెంచరీ చేశాడు. అది కూడా ఆస్ట్రేలియా లాంటి పటిష్ట జట్టుపై ఈ అరుదైన ఘనతను అందుకున్నాడు. ఆసీస్ భారత పర్యటన సందర్భంగా నవంబర్ 2న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియం వేదికగా జరిగిన ఏడో వన్డేలో రోహిత్ రెచ్చిపోయాడు. టీమిండియా తొలుత బ్యాటింగ్ చేయగా 383/6 పరుగుల భారీ స్కోర్ సాధించింది. శిఖర్ ధావన్( 57 బంతుల్లో 9 ఫోర్లతో 60)తో కలిసి హిట్మ్యాన్ (158 బంతుల్లో 12 ఫోర్లు, 16 సిక్సర్లతో 209) బౌండరీల మోత మోగించాడు. వీరిద్దరూ తొలి వికెట్కు 112 పరుగులు జోడించారు. ధావన్ ఔటయ్యాక రైనా(28), ధోనీ(62)తో విలువైన భాగస్వామ్యాలు జోడించారు. ఇక చేజింగ్లో జేమ్స్ ఫాల్కనర్(116) శతకంతో పొరాడినా.. ఆస్ట్రేలియా 326 పరుగులు చేసి ఆలౌటైంది. ఈ ఇన్నింగ్స్ తర్వాతే రోహిత్ 'హిట్మ్యాన్'గా మారాడు.
మరో ఏడాది మరో డబుల్..
ఆస్ట్రేలియాపై అద్వితీయ ఇన్నింగ్స్ ఆడిన మరుసటి ఏడాదే రోహిత్ మరో మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. ఇది వన్డే క్రికెట్ చరిత్రలో అద్భుత ఇన్నింగ్స్గా నిలిచిపోయింది. 2014 శ్రీలంక.. భారత పర్యటన సందర్భంగా నవంబర్ 13న కోల్కతా ఈడెన్గార్డెన్స్ వేదికగా రోహిత్(173 బంతుల్లో 33 ఫోర్లు, 9 సిక్సర్లతో 264) విశ్వరూపం చూపించాడు. అతనికి అండగా విరాట్ కోహ్లీ( 64 బంతుల్లో 6 ఫోర్లతో 66) రాణించడంతో జట్టు స్కోర్ 404/5గా నమోదైంది. అనంతరం శ్రీలంక 251 పరుగులకు ఆలౌటైంది. అది రోహిత్ స్కోర్ కన్నా 13 పరుగులు తక్కువ కావడం విశేషం.
6 ఏళ్ల క్రితం..
తన వద్ద స్పోర్ట్స్ మేనేజర్గా పనిచేసిన రితికాతో హిట్ మ్యాన్ లవ్లో పడ్డాడు. ఈ ఇద్దరు కొన్నాళ్ల పాటు ప్రేమయాణం నడిపి ఆరేళ్ల క్రితం( 2015 డిసెంబర్ 13న) ఇదే రోజు వివాహ బంధంతో ఒక్కటయ్యారు. అయితే ముంబైలోని బోరివాలి స్పోర్ట్స్ క్లబ్లో రితికాకు రోహిత్ మోకాళ్లపై కూర్చొని మరి ప్రపోజ్ చేశాడట. 11 ఏళ్ల వయసులో ఇదే స్పోర్ట్స్ కబ్ల్లో క్రికెటర్గా కెరీర్ను మొదలుపెట్టిన రోహిత్ శర్మ.. తన ప్రేమను కూడా ఇక్కడే తెలియజేశాడట. ఇక రోహిత్ శర్మ కన్నా ముందు రితికా.. విరాట్ కోహ్లీ, యువరాజ్ సింగ్ల వద్ద మేనేజర్గా పనిచేసింది. యువీని అన్నయ్య అని పిలిచేది. ఈ క్రమంలోనే రితికా వెంటపడుతున్న హిట్మ్యాన్ను యువీ ఓసారి మందలించాడట.