న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 సీజన్లో సన్రైజర్స్ హైదరాబాద్ తరఫున సత్తా చాటిన కశ్మీర్ ఎక్స్ప్రెస్ ఉమ్రాన్ మాలిక్ను టీ20 ప్రపంచకప్ జట్టులోకి తీసుకునే అవకాశాలను పరిశీలిస్తామని టీమిండియా కెప్టెన్ రోహిత్ శర్మ అన్నాడు. ఐపీఎల్ సంచలన ప్రదర్శనతో సౌతాఫ్రికాతో సిరీస్కు టీ20 జట్టులోకి ఎంపికైన ఉమ్రాన్ మాలిక్కు తుది జట్టులో చోటు దక్కలేదు. అతను నేర్చుకునే దశలోనే ఉన్నాడని హెడ్ కోచ్ రాహుల్ ద్రవిడ్ పక్కనపెట్టగా.. ఐర్లాండ్తో టీ20 సిరీస్లో తాత్కలిక కోచ్ వీవీఎస్ లక్ష్మణ్ అతనికి అవకాశం ఇచ్చాడు.
అయితే ఆ సిరీస్లో ఉమ్రాన్ కేవలం ఒక్క వికెట్ (1/42) మాత్రమే తీశాడు. భారీగానే పరుగులు సమర్పించుకున్నప్పటికీ అతని పేస్ బాగుందని విశ్లేషకులు అభిప్రాయపడ్డారు. తాజాగా ఇంగ్లండ్తో టీ20 సిరీస్కు ఎంపికయ్యాడు. భారత సారథి రోహిత్ శర్మ కరోనా నుంచి కోలుకుని టీ20 సిరీస్కు సిద్ధమైపోయాడు. నేటి రాత్రి 10.30 గంటలకు సిరీస్లో తొలి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ క్రమంలో ఉమ్రాన్ మాలిక్ ఎంపిక సహా ఇతర విషయాలపై కెప్టెన్ రోహిత్ శర్మ ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడాడు.
'కరోనా నుంచి పూర్తిగా కోలుకున్నా. ప్రాక్టీస్ కూడా ప్రారంభించాను. కరోనా టెస్టులోనూ నెగిటివ్గా తేలింది. అందుకే టీ20ల్లో ఆడాలని నిర్ణయించుకున్నా. ముఖ్యమైన మ్యాచ్లు ఆడకుండా ఖాళీగా కూర్చుంటే చాలా కష్టంగా అనిపిస్తుంటుంది. టీ20 సిరీస్ కోసం ఎంపిక చేసిన జట్టులో చాలా మంది యువకులు ఉన్నారు. మరీ ముఖ్యంగా ఫాస్టెస్ట్ బౌలర్ ఉమ్రాన్ మాలిక్ బౌలింగ్ శైలిని పరిశీలిస్తున్నాం. జట్టుకు ఏం కావాలో ఉమ్రాన్కు బాగా తెలుసు. వచ్చే ప్రపంచకప్ కోసం జట్టును తయారు చేయాల్సిన అవసరం ఉంది.
అందులో భాగంగానే ప్రతి ఒక్కరికీ అవకాశాలు కల్పిస్తాం. భారత టీ20 లీగ్లో ఉమ్రాన్ మాలిక్ అద్భుతంగా బౌలింగ్ చేశాడు. అతడికి అవకాశాలు ఇవ్వడంపై ఎటువంటి సందేహం లేదు. అయితే, ఫ్రాంచైజీ క్రికెట్కు అంతర్జాతీయ మ్యాచ్లకు చాలా వ్యత్యాసం ఉంటుంది'అని రోహిత్ శర్మ చెప్పుకొచ్చాడు. ఎడ్జ్బాస్టన్లో టీమిండియా ఓటమిపై స్పందిస్తూ.. అన్నింటికీ సమయమే సమాధానం చెబుతుందని వ్యాఖ్యానించాడు.