జట్టు నుంచి తప్పించాలని ఎలా అంటారు:
హిట్మ్యాన్ ఇన్స్టాగ్రామ్ లైవ్లో మాట్లాడుతూ మీడియా, అభిమానులపై కాస్త ఆగ్రహం వ్యక్తం చేసాడు. 'పలానా ఆటగాడు రాణించట్లేదు.. అతడిని జట్టు నుంచి తప్పించండి అని కొందరు అంటుంటారు. కానీ ఇక్కడ మీరు ఒక్కటి అర్థం చేసుకోవాలి. ప్రత్యర్థి జట్టు కూడా విజయం కోసమే పోరాడుతుంది. అందరూ ఆటగాళ్లు తాను బాగా ఆడాలని, జట్టు గెలవాలనే కోరుకుంటారు. నేను కూడా ప్రతిసారి బాగా ఆడాలనుకుంటా. కొన్నిసార్లు అది సాధ్యం కాదు. జట్టులో ఆటగాళ్ల చోటు గురించి అధికారులు నిర్ణయాలు తీసుకుంటారు. మీరు క్రికెట్ను ఆస్వాందించండి' అని రోహిత్ అన్నాడు.
కథనాలు రాసేముందు ఒక్కసారి ఆలోచించాలి:
'మేం కొన్ని మ్యాచ్ల్లో ఓటమిని చవిచూసి ఉండొచ్చు. కానీ.. పరాజయాల కంటే విజయాలు ఎక్కువగా సాధిస్తున్నాం' అని అభిమానులను ఉద్దేశించి హిట్మ్యాన్ అన్నాడు. 'యువ ఆటగాళ్లకు సూచనలు, సలహాలు ఇస్తుంటా. రిషభ్ పంత్తో ఎక్కువగా మాట్లాడాను. అతడికి 20 ఏళ్లు మాత్రమే. అందరూ అతడిపైనే దృష్టి సారించడంతో ఒత్తిడికి గురవుతున్నాడు. ఉద్యోగంలో భాగంగా ఆటగాళ్లపై కథనాలు రాయాలని మీడియా భావిస్తుంటుంది. అయితే రాసేముందు ఒక్కసారి ఆలోచించాలి. అది ఎంతో ప్రభావితం చూపిస్తాయి' అని రోహిత్ పేర్కొన్నాడు.
ప్రతి మ్యాచ్ చివరిదిగా భావించాలి:
'యువ క్రికెటర్లకు ఒక్క విషయాన్ని సూచిస్తా. ఆడే ప్రతి మ్యాచ్ జీవితంలో చివరిదిగా భావించి ఆడాలి. అనుభవం కోసం ఎదురుచూడకూడదు. ఆటను మెరుగుపర్చుకోవాలి. ఎప్పుడూ నిరాశ చెందకూడదు' అని రోహిత్ సూచించాడు. ఇన్స్టాగ్రామ్ ఇంటర్వ్యూలో భాగంగా జట్టులోకి వచ్చిన కొత్తలో యువరాజ్తో తన పరిచయం ఎలా జరిగిందనే విషయాన్ని 'హిట్మ్యాన్' వెల్లడించాడు. యువరాజ్ తన మొదటి 'క్రికెట్ క్రష్' అని కూడా వెల్లడించాడు.
భారీ విరాళం:
కరోనాపై పోరాటం కోసం రోహిత్ శర్మ మొత్తం రూ.80లక్షలను విరాళంగా ప్రకటించాడు. పీఎం కేర్స్ ఫండ్కు రూ.45 లక్షలు.. మహారాష్ట్ర సీఎం రిలీఫ్ ఫండ్కు రూ.25 లక్షలు.. ఫీడింగ్ ఇండియా, వెల్ఫేర్ ఆఫ్ స్ట్రే డాగ్స్ సంస్థలకు చెరో రూ.5లక్షలు అందించినట్టు రోహిత్ ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. జొమాటో ఫీడింగ్ సంస్థ ద్వారా పేదల భోజనానికి, వీధి కుక్కుల సంరక్షణ కోసం రోహిత్ విరాళమిచ్చాడు.