సెమీ ఫైనల్లో ఓటమి
రోహిత్ శర్మ 2019 వన్డే ప్రపంచకప్లో ఏకంగా ఐదు సెంచరీలు బాది టీమిండియాని సెమీ ఫైనల్కి చేర్చాడు. కానీ న్యూజిలాండ్తో జరిగిన సెమీ ఫైనల్లో మాత్రం త్వరగానే ఔట్ అవ్వడంతో.. భారత్ ఓడిపోయి ఇంటిబాట పట్టింది. దీంతో రోహిత్ శర్మ తీవ్ర నిరాశ వ్యక్తం చేశాడు. అయితే వ్యక్తిగతంగా ప్రపంచకప్లు గెలవాలని తాను ఆశిస్తున్నట్లు తాజాగా వెల్లడించాడు. తాజాగా ఇండియా టుడేతో హిట్మ్యాన్ మాట్లాడుతూ తన మనసులోని మాటను బయటపెట్టాడు.
ప్రపంచకప్ గెలవాలని ఉంది
'ప్రపంచకప్ గెలవడం అందరి కల. వ్యక్తిగతంగానూ నాకు ప్రపంచకప్ గెలవాలని ఉంది. ఒక్కటే కాదు సాధ్యమైనన్ని. ప్రతిసారి భారీ అంచనాల మధ్య టోర్నీలో ఆడుతూ.. ప్రతి మ్యాచ్ గెలవాలని ఆశిస్తాం. కానీ ప్రపంచకప్ అనేది ఎప్పటికీ ప్రత్యేకం, అత్యుత్తమం' అని రోహిత్ శర్మ తెలిపాడు. 2011 వన్డే ప్రపంచకప్ గెలిచిన భారత్ జట్టులో రోహిత్ శర్మకి చోటు లభించలేదు. దీంతో వన్డే ప్రపంచకప్ని ముద్దాడాలనే అతని కల అలానే మిగిలిపోయింది. 2007 టీ20 ప్రపంచకప్, 2013లో ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన భారత జట్టులో రోహిత్ ఉన్నాడు.
ఖాళీ స్టేడియంలో ఆడటం విచిత్రంగా ఉంటుంది
'ఖాళీ స్టేడియంలో క్రికెట్ ఆడటం విచిత్రంగా ఉంటుంది. అభిమానులు అందుకు ఒప్పుకోరని నేను అనుకుంటున్నాను. నా చిన్నతనంలో ఎవరూ లేని చోట క్రికెట్ ప్రాక్టీస్ చేసేవాడిని. మళ్లీ ఇప్పుడు అదే పరిస్థితి వస్తుందని నాకు అనిపిస్తుంది. ఐపీఎల్ టోర్నీపై బోర్డు ఏ నిబంధనలతో ముందుకొస్తుందో.. వాటిని పాటించక తప్పుదు. ఇలా చేస్తే.. కనీసం అభిమానులు మమ్మల్ని టీవీలో అయినా చూస్తారు. వారికి అది కాస్త ఊరటనిస్తుంది' అని రోహిత్ అన్నాడు.
మూడు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నా
'మూడు నెలలుగా క్రికెట్కు దూరంగా ఉన్నా. న్యూజిలాండ్లో టెస్టు సిరీస్పై ఎన్నో ఆశలు పెట్టుకుంటే.. గాయం కారణంగా ఆ పర్యటన నుంచి అర్ధాంతరంగా తప్పుకోవాల్సి వచ్చింది. ఆ తరువాత లాక్డౌన్ కారణంగా ఇంటికే పరిమితమయ్యా. ఫిబ్రవరి 2న అంతర్జాతీయ స్థాయిలో చివరి బంతి ఆడా. ఎప్పుడెప్పుడు లాక్డౌన్ ముగుస్తుందా, ఎంత త్వరగా తిరిగి మైదానంలో అడుగుపెడుతానా అని ఎదురుచూస్తున్నా' అని హిట్మ్యాన్ పేర్కొన్నాడు.