
ముంబై: ఆదివారం ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో అభిమానులతో మాట్లాడిన టీమిండియా స్టార్ ఓపెనర్ రోహిత్ శర్మ.. వారు అడిగిన సరదా ప్రశ్నలకి సమాధానమిచ్చాడు. ఈ క్రమంలో అంతర్జాతీయ క్రికెట్లో బెస్ట్ ఫీల్డర్ ఎవరు? అని ఓ అభిమాని హిట్మ్యాన్ను అడగ్గా.. న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్తిల్ తన దృష్టిలో అత్యుత్తమ ఫీల్డర్ అని చెప్పాడు. గప్తిల్ని ఎంపిక చేయడంపై ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చ నడుస్తోంది.
గత ఏడాది ఇంగ్లండ్ వేదికగా జరిగిన వన్డే ప్రపంచకప్ నుంచి సెమీస్ దశలో భారత్ నిష్క్రమించడానికి కారణం మార్టిన్ గప్తిల్ చేసిన రనౌట్. న్యూజిలాండ్తో జరిగిన ఆ మ్యాచ్లో మాజీ కెప్టెన్ ఎంఎస్ ధోనీని కీలక సమయంలో గప్తిల్ రనౌట్ చేసాడు. దీంతో భారత్ ప్రపంచకప్ ఆశలకి గండిపడింది. అయినా కూడా గప్తిల్నే బెస్ట్ ఫీల్డర్గా రోహిత్ అభివర్ణించడంపై కొంత మంది ఫాన్స్ మండిపడుతున్నారు. సురేశ్ రైనా, రవీంద్ర జడేజా, విరాట్ కోహ్లీలో ఎవరో ఒకరి పేరు చెప్పొచ్చు కదా? అని అంటున్నారు. మరికొందరు మాత్రం రోహిత్ నిజాయతీగా తన అభిప్రాయం చెప్పాడని ప్రశంసిస్తున్నారు.
హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఈ ఏడాది ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020తో పాటు 2020 టీ20 ప్రపంచకప్ కూడా జరగాలని ఆశిస్తున్నాడు. ఐపీఎల్, టీ20 ప్రపంచకప్ రెండు టోర్నీల్లో ఏది జరుగుతుందని ఆశిస్తున్నారు అని ఓ అభిమాని అడగ్గా.. 'ఆస్ట్రేలియా వేదికగా అక్టోబర్లో జరగాల్సిన టీ20 ప్రపంచకప్తో పాటు ఐపీఎల్లో జరగాలని కోరుకుంటున్నా. ఆ రెండు టోర్నీల్లోనూ బరిలోకి దిగాలనుంది' అని రోహిత్ సమాధానం ఇచ్చాడు. రోహిత్ శర్మ భారత్ తరఫున 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు.
ఇన్స్టాగ్రామ్ లైవ్ చాట్ సందర్భంగా ప్రస్తుత క్రికెట్లో మీరు ఎవరి బ్యాటింగ్ను ఎక్కువ ఆస్వాదిస్తారు? అని ఓ అభిమాని అడగ్గా.. ఆస్ట్రేలియా మాజీ కెప్టెన్ స్టీవ్ స్మిత్, ఇంగ్లండ్ ఓపెనర్ జేసన్ రాయ్ పేర్లను రోహిత్ శర్మ చెప్పాడు. సచిన్ టెండూల్కర్, వీరేందర్ సెహ్వాగ్లలో మీకు ఇష్టమైన వాళ్లు ఎవరు అని ప్రశ్నించగా.. నేను చావాలనుకుంటున్నారా ఏంటి? అని చెప్పి తప్పించుకున్నాడు. సచిన్, సెహ్వాగ్ పేర్లను చెప్పకుండా ఇలా తెలివిగా సమాధానమిచ్చాడు హిట్మ్యాన్.