
హైదరాబాద్: సిరీస్ ఆఖరిలో వచ్చి కప్ గెలుచుకుని పోయాడు రోహిత్ శర్మ. సఫారీ పర్యటనలో భాగంగా రోహిత్ శర్మ ఒక్క మ్యాచ్లోనూ పరుగులు సంపాదించింది లేదు. ఒక్క వన్డేలో మాత్రం సెంచరీని పూర్తి చేసి ఔరా అనిపించిన తదుపరి మ్యాచ్లన్నింటిలోనూ యథావిధిగా 30 పరుగులకు మించని స్కోరుకు పరిమితమై పెవిలియన్ బాట పట్టాడు.
ఇలా వ్యక్తిగత ప్రదర్శన ఏమీ చేయకపోయినా కెప్టెన్ కోహ్లీ వెన్నునొప్పి కారణంగా టీ 20 సిరీస్లో ఆఖరిదైన ఐదో టీ20కు వైస్ కెప్టెన్ నుంచి కెప్టెన్ అయిపోయాడు. ఉత్కంఠభరితంగా సాగిన ఈ ఆఖరి టీ20లో 173 పరుగుల విజయ లక్ష్యాన్ని సఫారీ జట్టు ఛేదించలేకపోవడంతో కేవలం ఏడు పరుగుల తేడాతో భారత జట్టు విజయం సాధించింది. దీంతో కెప్టెన్ రోహిత్ చేతులతో సిరీస్ విన్నింగ్ కప్ అందుకున్నాడు.
ఈ నేపథ్యంలో రోహిత్ విశిష్ట కెప్టెన్ల జాబితాలో చోటు సంపాదించుకున్నాడు. కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టిన మ్యాచ్తోనే సిరీస్ను కైవసం చేసుకున్న కెప్టెన్ల జాబితాలో చేరిపోయాడు. ఇంతకుముందు మిస్బావుల్ హక్, షాహిద్ అఫ్రిది, సర్ఫరాజ్ అహ్మద్, శ్రీలంక ఆటగాళ్లు సంగక్కర, లసిత్ మలింగలు కెప్టెన్గా బాధ్యతలు స్వీకరించిన తొలినాలుగు మ్యాచ్ల్లో విజయం సాధించారు.
వీరి సరసన రోహిత్ శర్మ చేరాడు. డిసెంబరు 2017లో శ్రీలంకతో జరిగిన టీ20 సిరీస్లో రోహిత్ శర్మ తొలిసారి సారథ్య బాధ్యతలు చేపట్టాడు.ఆ సిరీస్ను టీమ్ ఇండియా 3-0తో గెలుచుకుంది. అదే సిరీస్లో రోహిత్ శర్మ డబుల్ సెంచరీ చేసి అందరి ప్రశంసలు అందుకున్నాడు.