ఫామ్లో లేనట్టేనా:
ఐదో వన్డేలో చూపిన ప్రతిభకు గాను అతనికి మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్ ఇచ్చి సత్కరించారు. మ్యాచ్ అనంతరం రోహిత్ మీడియాతో మాట్లాడుతూ..‘మూడు మ్యాచుల్లో నేను సరిగా ఆడలేదు. దీన్ని బట్టే నేను ఫామ్ కోల్పోయానని ఎలా అంచనాకు వచ్చేస్తారు?. ఏ ఆటగాడైనా మూడు మ్యాచ్ల్లో విఫలమైతే ఫామ్లో లేడని ఎలా అంటారు?' అని విలేకరులపై రోహిత్ ఆగ్రహం వ్యక్తం చేశాడు.
అందరికీ సహజమే:
‘మొదటి మూడు మ్యాచ్ల్లో రాణించలేకపోయా. ఈ విషయాన్ని నేను అంగీకరిస్తా. నెట్స్లో బాగానే బ్యాటింగ్ చేసేవాడిని. ప్రతి క్రీడాకారుడు ఏదో ఒక సమయంలో ఇలాంటి సమస్య ఎదుర్కొంటాడు. ఆటలో ఇలాంటివన్ని సహజం. ఇలాంటి సవాళ్లు ఎదురైతేనే మనం ఇంకా ఎక్కువ కష్టపడతాం. నేను కూడా అంతే. ఏ రోజూ కుమిలిపోలేదు. ఒక్క అడుగు వెనక్కి వేసి.. ఇలా ఎందుకు జరుగుతోందని ఆలోచించా. తర్వాతి గేమ్లో అలా జరగకుండా జాగ్రత్తగా ఆడాలని నాకు నేనే సర్దిచెప్పుకున్నా' అని రోహిత్ వివరించాడు.
సెంచరీ పాతదైపోయింది:
అనంతరం తాను సాధించిన శతకం గురించి మాట్లాడుతూ..‘ఇప్పుడు నా సెంచరీ పాతదైపోయింది. తదుపరి మ్యాచ్పైనే దృష్టి అంతా. వీలైనన్ని ఎక్కువ పరుగులు సాధించి జట్టు స్కోరు పెంచాలి. ఇప్పటికే 4-1తో సిరీస్ను కైవసం చేసుకున్నాం. 5-1 తేడాతో సిరీస్ను దక్కించుకునేందుకు ప్రయత్నిస్తాం' అని రోహిత్ వివరించాడు.
నా కళ్ల ముందే ఇద్దరు రనౌట్:
ఫార్మాట్ ఏదైనా సెంచరీ చేయగానే అదో రకమైన భావోద్వేగంతో ఆటగాళ్లు తమదైన శైలిలో సంబరాలు చేసుకుంటారు. అంతేగాక డ్రెస్సింగ్ రూమ్లోని సహచర ఆటగాళ్లకు మైదానంలో ఉన్న శ్రేయోభిలాషులు, అభిమానుల వైపు తిరిగి అభివాదం చేయడం సాధారణమే. కానీ, సౌతాఫ్రికాతో ఐదో వన్డేలో శతకంతో రాణించిన హిట్మ్యాన్ రోహిత్ శర్మ మాత్రం ఆనందాన్ని పంచుకోలేదు. దీనికి గల కారణాన్ని అతడు ఇలా వివరించాడు.
అది నన్ను కలిచి వేసింది:
నా కారణంగానే నా కళ్ల ముందు ఇద్దరు ఆటగాళ్లు విరాట్ కోహ్లీ(36), ఆజింక్య రహానె(8) రనౌట్గా వెనుదిరిగారు. ఆ సమయంలో అది నన్ను కలిచి వేసింది.అందుకే సెంచరీ సంబరాన్ని చేసుకోకూడదని నిర్ణయించుకున్నానని మ్యాచ్ అనంతరం రోహిత్ తెలిపాడు.
పిలిచి రనౌట్ చేశాడు:
మోర్కెల్ బౌలింగ్లో సింగిల్ కోసం విరాట్ను పిలిచి మధ్యలో ఆగిపోగా..పిచ్ సగం దూరం వరకు దాటిన విరాట్ ..డుమిని వేసిన త్రోకు వెనుదిరగాల్సి వచ్చింది. కాసేపటికే రహానె సైతం రబాడ బౌలింగ్లో ఇదే తరహాలో పెవిలియన్ బాట పట్టాల్సివచ్చింది. అనంతరం పట్టుదలతో ఆడిన రోహిత్ సెంచరీ చేసి తన తప్పును సరిదిద్దుకున్నాడు.