బెంగళూరు : మూడు వన్డేల సిరీస్లో భాగంగా చిన్నస్వామి స్టేడియం వేదికగా ఆస్ట్రేలియాతో జరుగుతున్న డిసైడర్ వన్డేలో టీమిండియా ఓపెనర్ రోహిత్ శర్మ అరుదైన ఘనతను సొంతం చేసుకున్నాడు. ప్యాట్ కమిన్స్ వేసిన తొలి ఓవర్ రెండో బంతికి రెండు పరుగులు సాధించిన హిట్మ్యాన్ వన్డేల్లో 9000 పరుగులు పూర్తిచేసుకున్నాడు.
ఫలితంగా అత్యంత వేగంగా ఈ ఘనతనందుకున్న మూడో క్రికెటర్గా రోహిత్ శర్మ అరుదైన రికార్డుని తన ఖాతాలో వేసుకున్నాడు. టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ 194 ఇన్నింగ్స్లో ఈ ఘనతనందుకోగా.. 205 ఇన్నింగ్స్లతో సౌతాఫ్రికా లెజెండ్ డివిలియర్స్, రోహిత్ (217 ఇన్నింగ్స్లు) కన్నా ముందున్నాడు.
అదే క్రమంలో క్రికెట్ దిగ్గజాలు సచిన్ టెండూల్కర్, సౌరవ్ గంగూలీ, బ్రియన్ లారాల రికార్డుని కూడా రోహిత్ బద్దలు కొట్టాడు. వన్డేల్లో 9000 పరుగుల మైలురాయిని అందుకునేందుకు సౌరవ్ గంగూలీ 228 ఇన్నింగ్స్లు అవసరం కాగా... సచిన్ టెండూల్కర్ 235, లారా 239 ఇన్నింగ్స్లు తీసుకున్నారు.
స్మిత్.. 4000 పరుగులు..
ఈ మ్యాచ్ సెంచరీతో మెరిసిన ఆసీస్ బ్యాట్స్మన్ స్టీవ్ స్మిత్ వన్డేల్లో నాలుగువేల పరుగులు పూర్తి చేసుకున్నాడు. నవదీప్ సైనీ వేసిన 39 ఓవర్ రెండో బంతిని ఫోర్ కొట్టి వన్డేల్లో 4000 పరుగులు పూర్తి చేశాడు. కేవలం 121 వన్డేల్లోనే స్మిత్ ఈ ఘనత అందుకోవడం విశేషం. ఓపెనర్లు విఫలమైనా.. లబుషేన్, అలెక్స్ క్యారీతో కలిసి స్మిత్.. జట్టుకు భారీ స్కోర్ అందించే ప్రయత్నం చేశాడు . ఈ క్రమంలో 117 బంతుల్లో 11 ఫోర్లు సహాయంతో సెంచరీ సాధించాడు. ఇది స్మిత్కు వన్డేల్లో 9వ సెంచరీ కావడం విశేషం. అయితే స్మిత్ తన 8వ శతకం జనవరి 19, 2017 తేదీన చేయగా.. 9వ శతకం నేడు అదే తేదీన(జనవరి 19) చేయడం మరో విశేషం.