
హైదరాబాద్: త్వరలో జరగనున్న ఇంగ్లాండ్ పర్యటనను దృష్టిలో ఉంచుకుని ఇప్పటికే జట్టును ప్రకటించేసినా.. యోయో టెస్టులో పాసైన వాళ్లు మాత్రమే పర్యటనలో పాల్గొనాలని ఆంక్షలు ఉండటంతో బీసీసీఐ టెస్టులు నిర్వహిస్తూ వస్తోంది. ఈ నేపథ్యంలో.. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో బుధవారం నిర్వహించిన యో-యో ఫిట్నెస్ టెస్టులో భారత ఓపెనర్ రోహిత్ శర్మ పాసయ్యాడు.
నెలాఖర్లో ఐర్లాండ్తో టీ20 సిరీస్ ఆ తర్వాత ఇంగ్లాండ్ పర్యటన ఉండటంతో బీసీసీఐ గత వారం నుంచి భారత క్రికెటర్లకి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తోంది. ఇప్పటికే కెప్టెన్ విరాట్ కోహ్లి, మాజీ కెప్టెన్ మహేంద్రసింగ్ ధోనీ, బౌలర్ భువనేశ్వర్ కుమార్, మిడిలార్డర్ బ్యాట్స్మెన్స్ సురేశ్ రైనా, కేదార్ జాదవ్, అంబటి రాయుడు తదితరులు టెస్టు పూర్తి చేసుకున్నారు.
గత శుక్రవారం ఈ టెస్టుకి హాజరవగా.. రోహిత్ శర్మ మాత్రం వ్యక్తిగత కారణాల వల్ల ముందస్తు అనుమతితో హాజరవలేదు. దీంతో.. ఈరోజు రోహిత్ శర్మకి ఈ పరీక్ష నిర్వహించగా ఉత్తీర్ణత సాధించాడు. టెస్టు పాసైన అనంతరం రోహిత్ ట్విట్టర్ ద్వారా ఇలా స్పందించాడు. 'నా వరకూ నేనెక్కడ తిరుగుతున్నాను. ఏం చేస్తున్నాను అనేది మీకు అనవసరం. కావాలనుకుంటే నిజం తెలుసుకుని రాయండి. కానీ, అసత్యవార్తలు ప్రచారం చేయొద్దు' అంటూ కొన్ని మీడియా ఛానెళ్లను హెచ్చరించాడు.
ఐర్లాండ్తో జూన్ 27, 29న రెండు టీ20ల సిరీస్ని భారత్ అక్కడ ఆడనుంది. ఆ తర్వాత జూలై 3 నుంచి ఇంగ్లాండ్లో మూడు టీ20లు, మూడు వన్డేలతో పాటు ఐదు టెస్టుల సుదీర్ఘ సిరీస్ ఆడాల్సి ఉంది. ఈ నేపథ్యంలో.. ఢిల్లీ నుంచి జూన్ 23న భారత జట్టు బయల్దేరనుంది. యో-యో ఫిట్నెస్ టెస్టులో అంబటి రాయుడు ఫెయిలవగా.. అతని స్థానంలో సురేశ్ రైనాని ఇంగ్లాండ్ పర్యటనకి భారత సెలక్టర్లు ఎంపిక చేసిన విషయం తెలిసిందే. ఇకపై భారత జట్టుని సెలక్టర్లు ఎంపిక చేయకముందే ఆటగాళ్లకి ఫిట్నెస్ పరీక్షలు నిర్వహిస్తామని బీసీసీఐ మంగళవారం ప్రకటించింది.