మరొక్క ఓవర్ బ్యాటింగ్ చేసి ఉంటే:
తాజాగా భారత వెటరన్ ఆఫ్ స్పిన్నర్ రవిచంద్రన్ అశ్విన్తో హిట్మ్యాన్' రోహిత్ శర్మ ఇన్స్టాగ్రామ్ లైవ్ సెషన్లో మాట్లాడాడు. ఈ సందర్భంగా తొలి వన్డే డబుల్ సెంచరీ గురించి మాట్లాడాలని అశ్విన్ కోరాడు. దీంతో తన తొలి డబుల్ సెంచరీ నాటి స్మృతులు గుర్తు చేసుకున్నాడు. 'నేను డబుల్ సెంచరీ చేసిన తర్వాత తిరిగి డ్రెసింగ్ రూంకు వచ్చా. జట్టులోని కొందరు సభ్యులు వీరూ అత్యధిక పరుగుల రికార్డును బద్దలు కొట్టే అవకాశం వచ్చిందని మాట్లాడుకుంటున్నారు. నేను మరొక్క ఓవర్ బ్యాటింగ్ చేసి ఉంటే.. సెహ్వాగ్ రికార్డును బద్దలు కొడతానని యువరాజ్ సింగ్, శిఖర్ ధావన్ ఆశించారు' అని రోహిత్ తెలిపాడు.
సెహ్వాగ్ రికార్డు బద్దలు కొట్టాలని యువరాజ్ కోరుకున్నాడు:
'నేను సెహ్వాగ్ రికార్డును బద్దలు కొట్టాలని ముఖ్యంగా యువరాజ్ సింగ్ కోరుకున్నాడు. నేను ఔటై పెవిలియన్కు వచ్చిన తర్వాత మరిన్ని పరుగులు సాధిస్తే బాగుండేది, దీంతో సెహ్వాగ్ రికార్డు తెరమరుగయ్యేదని యువీ అన్నాడు. ఆ సమయంలో నా జోరు చూసి.. ఆ రికార్డు బ్రేక్ చేస్తానని టీమిండియా ఆటగాళ్లు చాలా అంచనాలను పెట్టుకున్నారు. కానీ ఆలా జరగలేదు. ఆ తర్వాత మళ్లీ అవకాశం వచ్చిందనుకోండి' అని రోహిత్ పేర్కొన్నాడు.
తొలి ద్విశతకం చేసింది సచిన్:
వీరేంద్ర సెహ్వాగ్ 2011లో వెస్టిండీస్పై 219 పరుగులు చేసాడు. రోహిత్ శర్మ ఆస్ట్రేలియాపై తన మొదటి డబుల్ సెంచరీని చేసాడు. 2013లో 158 బంతుల్లో 209 పరుగులు చేశాడు. 2014 లో శ్రీలంకపై 264 పరుగులు చేసి వన్డే క్రికెట్లో అత్యధిక స్కోరు సాధించిన రికార్డును కూడా సొంతం చేసుకున్నాడు. 2017లో లంకపైనే 208 పరుగులు చేసాడు. అంతర్జాతీయ వన్డే మ్యాచ్లలో తొలి ద్విశతకం సచిన్ టెండూల్కర్ బ్యాటు నుంచి జాలు వారింది. 2010లో దక్షిణాఫ్రికాతో జరిగిన మ్యాచ్లో సచిన్ 200 పరుగులు సాధించాడు.
32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు:
రోహిత్ శర్మ ఇప్పటివరకు 32 టెస్టులు, 224 వన్డేలు, 108 టీ20లు ఆడాడు. పరిమిత ఓవర్ల వైస్ కెప్టెన్ అయిన రోహిత్ అన్ని ఫార్మాట్లలో 14,029 పరుగులు చేశాడు. ఐపీఎల్ సందడితో ఎంతో ఉత్సహంగా కన్నుల పండుగగా ఉండాల్సిన ఈ సమయంలో ప్రపంచవ్యాప్తంగా క్రీడాకారులు ఎక్కడివారక్కడే ఇరుక్కుపోయారు. కరోనా మహమ్మారి కారణంగా ఐపీఎల్ 2020 నిరవధికంగా నిలిపివేయబడిన సంగతి తెలిసిందే.