రీఎంట్రీపై కన్నేసిన రాబిన్ ఉతప్ప!!

దుబాయ్: యూఏఈ వేదికగా త్వరలోప్రారంభం కానున్న ఐపీఎల్ 13వ సీజన్లో సత్తాచాటి టీమిండియాలోకి రీఎంట్రీ ఇవ్వాలని భారత వెటరన్ ఆటగాడు రాబిన్ ఊతప్ప చూస్తున్నాడు. గత దశాబ్దన్నర కాలంగా ఎంఎస్ ధోనీ రెగ్యులర్ వికెట్ కీపర్గా ఉండటంతో.. ఊతప్ప కేవలం బ్యాట్స్మెన్గా మాత్రమే కొన్ని మ్యాచ్ల్లో ఆడాడు. చివరగా భారత్ తరఫున 2015లో అతడు అంతర్జాతీయ మ్యాచ్ ఆడాడు. 2006లో టీమిండియాలోకి ఎంట్రీ ఇచ్చిన ఉతప్ప.. ఇప్పటి వరకూ 46 వన్డేలు, 13 టీ20 మ్యాచులు ఆడాడు.

రాయల్స్ జట్టుకు:
గతేడాది కోల్కతా నైట్ రైడర్స్ తరఫున ఆడిన రాబిన్ ఊతప్ప.. ఈసారి రాజస్థాన్ రాయల్స్ జట్టుకు ఆడనున్నాడు. ఐపీఎల్ 2020 వేలంకు ముందు కోల్కతా ఊతప్పను వదులుకోగా.. అతడు వేలంలోకి వచ్చాడు. రూ.3 కోట్లకి ఉతప్పని రాయల్స్ దక్కించుకుంది. యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి టోర్నీ ప్రారంభంకానుంది. ఇందుకోసం ఇప్పటికే అతడు యూఏఈకి చేరుకున్నాడు. రాయల్స్ ట్వీటర్ వేదికగా అడిగిన ఒక ప్రశ్నకు సమాధానంగా ఊతప్ప తన మనసులోని మాటను వెల్లడించాడు. మళ్లీ టీమిండియాకి ఆడాలనే తన కల సజీవంగానే ఉన్నట్లు తాజాగా వెల్లడించాడు.

ఆ డ్రీమ్ సజీవంగానే ఉంది:
ఒక మంచి ఐపీఎల్ సీజన్ నిన్ను తిరిగి అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టేలా చేస్తుందని నమ్ముతున్నారా? అని రాబిన్ ఊతప్పను అడగ్గా... ఇంకా ఆ డ్రీమ్ సజీవంగానే ఉందని పేర్కొన్నాడు. 'టీమిండియాకు ఆడాలనే డ్రీమ్ సజీవంగానే ఉంది. ఒకవేళ ఐపీఎల్లో నేను నిలకడగా రాణించి మెరుగైన ఇన్నింగ్స్లు ఆడితే.. తప్పకుండా మళ్లీ టీమిండియాలోకి సెలెక్ట్ అవుతా. కాంపిటేటివ్ క్రికెట్ ఆడేవాళ్ల ప్రతి ఒక్కరి కల దేశం తరఫున ఆడటం. టీమిండియాకు ఆడాలనే నా డ్రీమ్ సజీవంగానే ఉంది' అని ఉతప్ప తెలిపాడు.

ఓపెనింగ్ కూడా చేశాడు:
2015లో భారత్ తరఫున చివరిసారి ఆడిన రాబిన్ ఊతప్ప.. 46 వన్డేలు, 13 టీ20 మ్యాచ్లు ఆడాడు. వన్డేల్లో 25.94 యావరేజ్తో 934 పరుగులు చేయగా.. అంతర్జాతీయ టీ20ల్లో 249 పరుగులు చేశాడు. ఒకానొక సమయంలో ఓపెనింగ్ కూడా చేశాడు. 2007లో భారత్ జట్టు గెలిచిన టీ20 ప్రపంచకప్లో ఊతప్ప సభ్యుడు. ఇక ఐపీఎల్ కెరీర్ విషయానికొస్తే./.. 177 మ్యాచ్లు ఆడి 4,411 పరుగులు చేశాడు. ఇక్కడ యావరేజ్ 28.83 ఉండగా, స్టైక్రేట్ 130.5గా ఉంది. కాగా కోల్కతా గెలిచిన రెండు ఐపీఎల్ టైటిల్స్లో ఊతప్ప భాగం.

ఐదేళ్లుగా అవకాశమే రాలేదు:
ఐపీఎల్, దేశవాళీ క్రికెట్లో రెగ్యులర్ ఆడుతున్న వికెట్ కీపర్ రాబిన్ ఉతప్పకి గత ఐదేళ్లుగా భారత్ తరఫున ఆడే అవకాశమే రాలేదు. కానీ ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్ ప్రకటించడంతో మళ్లీ అతని రీఎంట్రీ ఆశలు చిగురించినట్లు కనిపిస్తున్నాయి. అయితే ధోనీ స్థానంలో వికెట్ కీపర్గా రిషబ్ పంత్, కేఎల్ రాహుల్కి భారత సెలక్టర్లు వరుస అవకాశాలిస్తున్నారు. ఇక యువ కీపర్లు కేఎస్ భరత్, సంజు శాంసన్ రేసులో ఉన్నారు. వీరందరిని దాటుకుని ఉతప్పను అవకాశం వరిస్తుందో లేదో చూడాలి.
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications
'అన్ని సిక్సర్లు బాదాలంటే.. 40 ఏళ్లు ఆడాల్సిందే'