IPL 2022 Retention: ధోనీ తర్వాత రవీంద్ర జడేజానే సీఎస్కే కెప్టెన్!

న్యూఢిల్లీ: ఐపీఎల్ 2022 మెగా వేలానికి ముందు చెన్నై సూపర్ కింగ్స్(సీఎస్కే) నలుగురి ఆటగాళ్లను రిటైన్ చేసుకుంది. కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీతో పాటు ఆల్రౌండర్ రవీంద్ర జడేజా, మోయిన్ అలీ, రుతురాజ్ గైక్వాడ్లను అంటిపెట్టుకుంది. అయితే ఈ రిటెన్షన్ ప్రక్రియలో ధోనీ కన్నా జడేజాకే సీఎస్కే యాజమాన్యం ప్రాధాన్యత ఇచ్చింది. ఫస్ట్ స్లాబ్ ప్లేయర్గా జడేజాను రిటైన్ చేసుకోవడంతో అతనికి రూ.16 కోట్ల కాంట్రాక్టు దక్కగా.. ధోనీకి రూ.12 కోట్లే దక్కాయి. మొయిన్ అలీ రూ.8 కోట్లు, రుతురాజ్ గైక్వాడ్లకు రూ..6 కోట్లు చెల్లించనుంది. అయితే ధోనీని కాదని జడేజాకు ప్రాధాన్యత ఇవ్వడం చర్చనీయాంశమైంది.

రాబిన్ ఊతప్ప జోస్యం..
జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొనే సీఎస్కే ఫ్రాంచైజీ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ధోనీ రిటైర్మెంట్ తర్వాత జట్టును జడేజా నడిపించే అవకాశం ఉందనే ప్రచారం జరుగుతోంది. ఆ జట్టు మాజీ ప్లేయర్ రాబిన్ ఊతప్ప సైతం ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు.
ఆల్ రౌండర్ రవీంద్ర జడేజా సత్తా ఏంటో సీఎస్కే కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోనీకి తెలుసని రాబిన్ ఉతప్ప అన్నాడు. అందుకే ధోని తన రిటైర్మెంట్ తర్వాత చెన్నై పగ్గాలను జడేజాకే అప్పగిస్తాడని అనుకుంటున్నానని పేర్కొన్నాడు. జడేజాకు మార్గం సుగమం చేస్తూ ధోనీ.. తనకు తానే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడని తెలిపాడు.

పార్దీవ్ పటేల్ సైతం..
'ధోనీ కావాలనే రెండో ప్రాధాన్య ఆటగాడిగా కొనసాగాలని నిర్ణయించుకున్నాడు. జట్టులో జడేజా సత్తా ఏంటో అతనికి బాగా తెలుసు. ధోనీ నిష్క్రమణ తర్వాత జడేజాకే పగ్గాలు అప్పగిస్తాడనుకుంటున్నా' అని రాబిన్ ఉతప్ప పేర్కొన్నాడు. మాజీ క్రికెటర్ పార్థివ్ పటేల్ కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశాడు. 'చెన్నై జట్టు తర్వాతి కెప్టెన్కు కావాల్సిన అన్ని లక్షణాలు జడేజాలో ఉన్నాయి.
అతడో గొప్ప ఆటగాడు. టెస్టు క్రికెట్లో మెరుగ్గా రాణిస్తున్నాడు. వన్డే క్రికెట్లో కూడా ఆరో స్థానంలో బ్యాటింగ్కు దిగి కీలకంగా వ్యవహరిస్తున్నాడు. అందుకే, ధోనీ తర్వాతి కెప్టెన్గా జడేజానే సరైనోడనిపిస్తోంది' అని పార్థివ్ పటేల్ చెప్పుకొచ్చాడు.

రవీంద్ర జడేజా కూడా..
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ అవ్వాలనే తన మనసులోకి కోరికను రవీంద్ర డేజా సైతం వెల్లడించాడు. ఐపీఎల్ 2021 సీజన్ సందర్భంగా ట్విటర్ వేదికగా తన కోరికను పంచుకున్నాడు. మహేంద్ర సింగ్ ధోనీ తర్వాత చెన్నైని నడిపించే ఆటగాడు ఎవరు అంటూ? ఓ అభిమాని ప్రశ్నించగా.. జడేజా నేనే అంటూ కామెంట్ చేశాడు. కానీ ఆ కొద్దిసేపటికే ఆ కామెంట్ను తొలగించాడు. కానీ అప్పటికే దానికి సంబంధించిన స్క్రీన్ షాట్స్ వైరల్ అయ్యాయి.

చెన్నై సూపర్ కింగ్స్ రిటెన్షన్ లిస్ట్..
రవీంద్ర జడేజా- రూ. 16 కోట్లు
ఎంఎస్ ధోనీ- రూ. 12 కోట్లు
మొయిన్ అలీ- రూ. 8 కోట్లు
రుతురాజ్ గైక్వాడ్- రూ. 6 కోట్లు
ఖర్చు చేసింది రూ. 42 కోట్లు, మిగిలింది రూ.48 కోట్లు
- Male
- Female
- Others
- Under 18
- 18 to 25
- 26 to 35
- 36 to 45
- 45 to 55
- 55+


Click it and Unblock the Notifications