ముంబై: భారత స్టార్ ఆటగాడు విరాట్ కోహ్లీకి బౌలింగ్ చేసేటప్పుడు తాను కసితో రగిలిపోతానని బంగ్లాదేశ్ పేసర్ రుబెల్ హుస్సేన్ అన్నాడు. అండర్-19 రోజుల నుంచి కోహ్లీతో పోరాటాన్ని ఆస్వాదిస్తున్నానని రుబెల్ చెప్పాడు. 2008లో అండర్ 19 ప్రపంచ కప్ భారత జట్టుకు విరాట్ కోహ్లీ సారథ్యం వహించిన విషయం తెలిసిందే.
'మేము ఎప్పటి నుంచో తలపడుతున్నాం. అతడికి బౌలింగ్ నాకు సవాల్. మైదానంలో కోహ్లి చాలా దూకుడుగా ఉంటాడు. మైదానం వెలుపుల అతడు మంచి కుర్రాడు' అని తెలిపాడు. 'అతడికి బౌలింగ్ చేసేటప్పుడు నాలో ఏదో భిన్నమైన భావన కలుగుతుంది. అతడికి నా బౌలింగ్లో చెలరేగే అవకాశమివ్వను. అతడి వికెట్ పడగొట్టాలనుకుంటా' అని చెప్పాడు.
'మరో ఎండ్లో అతణ్ని(కోహ్లీ) చూసినప్పుడల్లా నేను కసితో రగిలిపోతా. అండర్-19 రోజుల నుంచీ ఇంతే' అని రుబెల్ చెప్పాడు. 2014 ఆసియాకప్ సందర్భంగా ఈ ఇద్దరు ఆటగాళ్లు గొడవపడ్డ సంగతి తెలిసిందే.
ఐసిసి ప్రపంచ కప్ 2015లో రుబెల్ వేసిన వైడ్ బంతిని ఆడి వికెట్ కీపర్ క్యాచ్ పట్టడంతో కోహ్లీ ఔటయ్యాడు. అప్పుడు 4 బంతుల్లో 3 పరుగులు చేసిన కోహ్లీ వెనుదిరిగాడు. కోహ్లీ వికెట్ తీసిన ఆనందంలో రుబెల్ అత్యుత్సాహం ప్రదర్శించాడు. ఇలా చాలా సార్లు రుబెల్ తన బౌలింగ్ ప్రతిభతోపాటు అత్యుత్సాహాన్ని కూడా ప్రదర్శిస్తున్నాడు.
కోహ్లీ వికెట్ తీయడం అంత కష్టమైన పని కాదని, అండర్-19 మ్యాచుల్లో, అంతర్జాతీయ మ్యాచుల్లోనూ అతని వికెట్ చాలా సార్లు పడగొట్టానని రుబెల్ పేర్కొన్నాడు. ఇప్పుడు కూడా అతని వికెట్ తీసేందుకు ఉత్సాహంగా ఉన్నానని చెప్పాడు. మైదానంలోనే తాము ప్రత్యర్థులమని, మైదానం బయట మాత్రం మంచి స్నేహం ఉందని పేర్కొన్నాడు.